దేశం మీసం తిప్పిన ‘ఇస్రో’.. విజయపరంపరలో మైలురాళ్లెన్నో...
ఇస్రో నమ్మకం వమ్ముకాలేదు. తన విశ్వసనీయ నేస్తమైన పీఎస్ఎల్వీ-సీ37 బుధవారం ఒకేసారి 104 ఉపగ్రహాలతో నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లి దేశం మీసం తిప్పింది.
శ్రీహరికోట: ఒక్క రాకెట్ తో 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయంగా ఒక్క రష్యా మాత్రమే 37 ఉపగ్రహాలను ఒకే అంతరిక్ష నౌక ద్వారా రోదసిలోనికి పంపింది.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అయితే, ఒకే అంతరిక్ష నౌక ద్వారా ఇప్పటి వరకు 29 ఉపగ్రహాలు మాత్రమే పంపింది. ఈ దిగ్గజాల రికార్డులన్నీ తోసిరాజంటూ భారత్ శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సి37 అనే ఒక్క ఉపగ్రహ వాహక నౌక ద్వారా మొత్తం 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
మనవి 3.. విదేశాలవి 101
మొత్తం 104 ఉపగ్రహాలలో.. 101 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి. అంతరిక్ష రంగంలో ఇదొక మైలురాయి. మిగిలిన మూడు ఉపగ్రహాలు.. కార్టోశాట్-2డి, ఐఎన్ఎస్-1ఎ, ఐఎన్ఎస్-1బి.. అచ్చంగా మనవే.
కార్టోశాట్-2డి అత్యాధునిక కెమెరాలతో భూమికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని అందిస్తుంది. దీని బరువు 730 కిలోలు కాగా మిగిలిన రెండు నావిగేషన్ వ్యవస్థకు ఉపయోగపడే నానో ఉపగ్రహాలు. వీటి బరువు ఒక్కోటీ 15 కిలోల వరకు ఉంటుంది.
ప్రపంచానికే ఆదర్శంగా...
వీటిలో ఒక్క అమెరికాకు చెందిన ఉపగ్రహాలే 96 ఉండగా... ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, కజకిస్థాన్, నెదర్లాండ్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి. ఒకప్పుడు ఇతర దేశాల నుంచి మన దేశం సాంకేతిక సహాయాన్ని అరువుతెచ్చుకుంటే.. ఇప్పుడు చాలా దేశాలు మన సాంకేతిక సాయం తీసుకుంటున్నాయి. అపార అనుభవం, అత్యంత చౌకైన సేవలు.. మన ‘ఇస్రో' ప్రత్యేకతలు.
ఆర్యభట్టతో ఆరంభం...
ఇస్రో తన ప్రయోగాల పరంపరను ఆర్యభట్ట ఉపగ్రహంతో ప్రారంభించింది. 1962లో కేరళలోని తుంబ రాకెట్ ప్రయోగ కేంద్రంతో అంతరిక్ష పరిశోధనలో తొలి అడుగు పడింది. ముందుగా వాతావరణ పరిస్థితుల అధ్యయనానికి ఉపకరించే మూడు అడుగుల చిన్న సౌండ్ రాకెట్లను (ఆర్ హెచ్-75) అంతరిక్షానికి పంపింది. 1975లో రష్యా సాంకేతిక సాయంతో మన దేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను రోదసిలోకి చేరవేసింది.
అటు పిమ్మట ‘రోహిణి’...
ఆ తరువాత 1979లో.. శ్రీహరికోట కేంద్రం నుంచి ఎస్ఎల్వీ రాకెట్ ను ఆంతరిక్షంలోకి సంధించింది. అయితే ఈ ప్రయత్నం విఫలమైనా.. ఈ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలతో 1980లో ఎస్ఎల్వీ రాకెట్ ‘రోహిణి'ని విజయవంతంగా రోదసిలోకి చేర్చగలిగింది ఇస్రో.
‘భాస్కర’తో మరో అడుగు ముందుకు...
197981 మధ్య కాలంలో భాస్కర ప్రయోగం.. భారత అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగనే చెప్పాలి. అనతి కాలంలో శాస్త్ర, సాంకేతిక ప్రయోజనాలను సామాన్యులకు చేరువ చేసేందుకు సమాచార ఉపగ్రహ ప్రయోగాలనూ ఇస్రో చేపట్టింది.
సమాచార ‘ఆపిల్’...
1975-76లో శాటిలైట్ ఇన్ స్ట్రుమెంట్ టెలివిజన్ ఎక్స పరిమెంట్ ద్వారా.. సమాచార ఉపగ్రహాన్ని విద్యాబోధన సాధనంగా ఎలా ఉపయోగించుకోవచ్చే కూడా నిరూపించింది. 1979లో ఆపిల్ సమాచార ఉపగ్రహాన్ని పంపింది.
విద్యావ్యాప్తికి ‘ఇన్సాట్-1’
1982-90 మధ్యకాలంలో విదేశీ రాకెట్ల సాయంతో ‘ఇన్సాట్-1'ను రోదసిలోకి సంధించింది. ఇది ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలను అనుసంధానం చేసి వినోద, విజ్ఞానాలతోపాటు విద్యావ్యాప్తికి ఎంతగానో తోడ్పడింది.
ప్రతిష్ఠాత్మకం.. చంద్రయాన్, మంగళ్ యాన్
ఆ తరువాత చంద్రయాన్, మంగళ్ యాన్ తదితర ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు ఇస్రో శ్రీకారం చుట్టింది. గత ఏడాది మొత్తం తొమ్మిది ప్రయోగాలు చేపట్టగా.. అన్నీ విజయవంతం అయ్యాయి.
ఆ తరువాత అన్నీ విజయాలే...
ఒక్క రాకెట్ ద్వారా వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలు ప్రవేశపెట్టడం ఇస్రో సంచలన విజయం. ఆ తరువాత పీఎస్ఎల్వీ-సి36 పీఎస్4లో (నాలుగో దశ) రిమోట్ కంట్రోల్ సిస్టంతో ద్రవ ఇంధనం నింపడం, నావిక్ వ్యవస్థ ద్వారా రాకెట్ ను పర్యవేక్షించడం, ప్రతికూల వాతావరణంలోనూ రాకెట్ అనుసంధానం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉపగ్రహంలోని పేలోడ్లను స్వయంగా అభివృద్ధి చేసుకోవడం... ఇలా అన్నీ విజయాలే.
ఒకేసారి 104 ఉపగ్రహాలు...
తాజాగా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలను సైతం దాటుకుని ముందుకెళ్లిన ఇస్రో.. అంతరిక్ష ప్రయోగాల్లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించింది.
విశ్వసనీయ నేస్తం.. పీఎస్ఎల్వీ...
ఇస్రో విజయ పరంపరలో శ్రీహరికోట లోని పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) విశ్వసనీయ నేస్తంగా మారింది. దీని ద్వారా 38 సార్లు.. వివిధ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి చేరవేసింది. మంగళ్ యాన్ తో పాటు అనేక కీలక విజయాలను ఈ వాహక నౌకే అందించింది. మరో వాహక నౌక జీఎస్ఎల్వీతో పది ప్రయోగాలు జరగ్గా.. అందులో ఆరు మాత్రమే విజయవంతం అయ్యాయి.
దేశం మీసం తిప్పిన వేళ...
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఒకేసారి 104 ఉపగ్రహాల ప్రయోగానికి తన విశ్వసనీయ నేస్తమైన పీఎస్ఎల్వీ-సీ37 రాకెట్ నే రంగంలోకి దించింది. ఇస్రో నమ్మకాన్ని నిలబెడుతూ.. బుధవారం ఒకేసారి 104 ఉపగ్రహాలను మోసుకుని నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసిన పీఎస్ఎల్వీ ప్రపంచంలోనే మన దేశం మీసం తిప్పింది.
నేటి ప్రయోగంతో కలిపి ఇప్పటి వరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మొత్తం 60 ప్రయోగాలు చేపట్టింది. ఈ ప్రయోగాల ద్వారా మన దేశానికి చెందిన 87 ఉపగ్రహాలను, విదేశాలకు చెందిన 180 ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. ఇంకా వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు రూపొందించిన ఎనిమిది ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి చేరవేసింది.