నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-46 .. రక్షణ శాఖకు కీలకంగా ఈ ప్రయోగం
ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది . భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ46 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలో ప్రేవేశపెట్టింది. దీంతో పీఎస్ఎల్వీ-సీ46 ప్రయోగం దిగ్విజయమైంది.
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ46.. రక్షణ శాఖకు కీలకంగా మారనున్న ఉపగ్రహం
ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ మంగళవారం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమైంది. 25 గంటల కౌంట్డౌన్ ముగిసిన అనంతరం బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్ఎల్వీ-సీ46 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది. అత్యంత ఆధునిక రాడార్ ఇమేజింగ్ భూపరిశీలన ఉపగ్రహమైన రీశాట్-2బీఆర్1 కాలపరిమితి ఐదేళ్లు. ఈ ఉపగ్రహం రక్షణశాఖకు కీలకంగా మారనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది.
విపత్తు నిర్వహణలోనూ కీలకంగా రీశాట్-2బీఆర్1
అంతేకాక వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సాయపడనుంది. మొదటగా 2009లో రీశాట్ను ఇస్రో ప్రయోగించింది. 2012లో రీశాట్-1ను ప్రయోగించింది. రీశాట్ సిరీస్లో ఇది నాలుగో ఉపగ్రహం. 2009లో పంపిన రీశాట్-2 ఉపగ్రహం స్థానంలోకి దీనిని చేరుస్తారు. ఇందులో అమర్చిన అత్యాధునిక రాడార్ భూమిపై ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా స్పష్టమైన ఛాయాచిత్రాలను అందించగలుగుతుంది. ఇది ప్రధానంగా వాతావరణ మార్పులపై నిఘా ఉంచనుంది . విపత్తుల సమయంలో అత్యవసర సహాయం అందిస్తుంది. అంతేకాకుండా సైన్యం నిఘా కార్యకలాపాలకు కూడా సహాయపడనున్నది.
ప్రయోగం సక్సెస్.... శాస్త్రవేత్తల్లో వెల్లివిరుస్తున్న ఆనందం
ఇస్రో చైర్మన్ కే శివన్ మాట్లాడుతూ... రీశాట్-2బీ ప్రయోగం భారతదేశానికి, ఇస్రోకు అత్యంత ముఖ్యమైన మిషన్ అని పేర్కొన్నారు. ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 48వదని పేర్కొన్నారు. రక్షణా రంగానికి మాత్రమే కాకుండా , విపత్తు నిర్వహణకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ప్రయోగం సక్సెస్ కావటంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.