వయోపరిమితి పెంపు ఉందా? లేదా?...అలా చేస్తే దారుణ మోసం:ఎపి నిరుద్యోగుల ఆవేదన
అమరావతి:ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగుల గుండెలు గుబగుబలాడుతున్నాయి. కారణం ఎపి ప్రభుత్వం ఇటీవలే సుమారు 18 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
అయితే గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయోపరిమితిని పెంచుతూ ఇచ్చిన జీఓ కాలపరిమితి మొన్నసెప్టెంబర్ 30 తో ముగిసింది. కానీ ప్రభుత్వం మళ్లీ వయోపరిమితిని పెంచుతూ మళ్ళీ ఎలాంటి జీఓ విడుదల చేయకపోవడం...అసలు దాని ఊసే ఎత్తకపోవడమే వారి ఆందోళనకు కారణం. ఒకవేళ ప్రభుత్వం మళ్లీ జీవో జారీ చేయకుంటే త్వరలో వచ్చే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసేందుకు కేవలం 34 ఏళ్లలోపు వారు మాత్రమే అర్హులవుతారు.
మళ్లీ జీవో ఇవ్వండి...నిరుద్యోగుల ఆక్రందనలు
2017 డిసెంబర్ లో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42కు పెంచుతూ ఎపి ప్రభుత్వం జి.వో 182 జారీ చేసింది. అయితే దీని గడువు 2018 సెప్టెంబర్30 తో ముగిసిపోయింది. ఇప్పుడు ఇదే విషయమై 34 ఏళ్ల పైబడి వయస్సున్న నిరుద్యోగులను తీవ్రంగా కలవరపరుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం గనుక మళ్లీ వయోపరిమితి పెంచుతూ జీవో కనుక జారీ చేయనట్లయితే ఇంతకంటే నమ్మక ద్రోహం మరొకటి ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా వయోపరిమితి జీవో ఇచ్చి ఏమి లాభమని, తీరా ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చే సమయానికి గడువు తీరిపోతే అంతకుముందు ఇచ్చిన జీవో వలన ప్రయోజనం ఏమిటని వారు నిలదీస్తున్నారు.
ఆత్మహత్యలే...శరణ్యం
అయితే వయోపరిమితి జీవో గడువు సెప్టెంబర్ 30 తో ముగిసిపోయిందన్న విషయం చాలామంది నిరుద్యోగులకు తెలియక వయోపరిమితి వర్తిస్తుందనే భావనలో ఉన్నారని, కానీ ఒకవైపు ఎపిపిఎస్సీ అక్టోబర్ లో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వయోపరిమితికి సంబంధించి నూతన జీవో రాకుంటే చాలా మంది ఉద్యోగార్థులు అన్యాయమైపోతారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి మళ్లీ వయోపరిమితి జీవో రాకపోవచ్చని అధికారులు అంటున్నట్లు తెలిసిందని, అదే జరిగితే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎపిపిఎస్సి...విముఖత
అసలు ప్రభుత్వం నోటిఫికేషన్ల ఇవ్వకుండా వయోపరిమితి జీవోని ఇవ్వడం, జీవో గడువు ముగిశాక నోటిఫికేషన్ల ఇవ్వడం ఒక పథకం ప్రకారం జరిగిందేమోననే అనుమానాలు వస్తున్నాయని, అదే నిజమైతే అంతకంటే దారుణ మోసం ఇంకేం ఉండదని ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. వయోపరిమితి పెంపు పట్ల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తోందని, అందుకు నిదర్శనం గతంలో నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు వయోపరిమితి పెంపు కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాసిన ఏపీపీఎస్సీ ఈసారి మాత్రం ఎలాంటి లేఖలు రాయకపోవడమే అంటున్నారు.
నమ్మకద్రోహం...చేయొద్దు
వయోపరిమితి
పెంపుతో
ఎలాగైనా
ఉద్యోగాన్ని
పొందాలని
తాము
కోరుకునే
రంగానికి
సంబంధించిన
ఉద్యోగాల
కోసం
అప్పటి
నుంచి
కోచింగ్
తీసుకుంటున్న
వారు
లక్షల్లో
ఉన్నారని,
అప్పటినుంచి
జీవో
మాత్రమే
ఇచ్చి
ఉద్యోగాల
నోటిఫికేషన్ల
ఇవ్వకున్నా
ఎన్నికల
సమయంలో
ఇస్తారని
నిరీక్షిస్తూ...ఆర్థిక
ఇబ్బందులు
ఉన్నా
భవిష్యత్తు
బాగుంటుందని
ఇలా
శిక్షణ
పొందుతుంటే...ప్రభుత్వం
వయోపరిమితిని
పెంచకపోతే
అంతకంటే
నమ్మక
ద్రోహం
మరోటి
ఉండదంటున్నారు
నిరుద్యోగులు.
బాబు
వస్తే
జాబు
వస్తుందని
నమ్మిన
తమని
నట్టేట్లో
ముంచొద్దని
వేడుకుంటున్నారు.
నిరుద్యోగ భృతి...అందులోనూ అన్యాయమే!
నిరుద్యోగ భృతి విషయంలోనూ వయోపరిమితి విషయంలో అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని....ఆ పథకానికి వయస్సు 22 సంవత్సరాల నుంచి 35 వరకు పరిమితి పెట్టారని...అసలు 22 ఏళ్ల వ్యక్తిని నిరుద్యోగిగా మన సమాజం పరిగణిస్తుందా అని ప్రశ్నించారు. అప్పుడే చదువు పూర్తయిన వారు ఉద్యోగం పొందటానికి చాలా ఏళ్లు అవకాశం ఉంటుందని, ఇంట్లో కూడా వాళ్లని నిరుద్యోగులుగా పరిగణించరని...నిలదొక్కుకోవడానికి సమయం పడుతుందని సపోర్ట్ ఇస్తారేతప్ప భారంగా భావించరన్నారు. అదే వయస్సు పెరిగిన నిరుద్యోగులు ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఉంటే...ఇట్లో వాళ్లు కూడా వారిని భారంగా భావిస్తారని అలాంటివారికి ఊతంగా ప్రభుత్వం ఇచ్చే భృతి ఎంతో చేయూతగా ఉంటుందని నిరుద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ల కోసం వయోపరిమితిపెంపు వర్తింపచేసి తమ జీవితాల్లో వెలుగులు నింపుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.