ఏపీలో ఆస్తిపన్ను మోత ప్రారంభం-కొత్త రేట్లతో నోటీసులు-రిజిస్ట్రేషన్ ధరలు పెరిగితే మరింతగా..
ఏపీలో కొత్త ఆస్తిపన్ను ప్రభావం మొదలుకాబోతోంది. ప్రభుత్వం తాజాగా సవరించిన ఆస్తిపన్ను ప్రకారం డిమాండ్ నోటీసులను పురపాలక సంస్ధలు జారీ చేస్తున్నాయి. గతంలో అద్దె విలువ ప్రకారం విధించే పన్ను కాస్తా ఈసారి నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారంగా విధించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అలాగే ఆస్తిపన్నును 10 నుంచి 15 శాతం పెంచారు. ఈ మార్పులతో కొత్త నోటీసులను త్వరలో ఇళ్లకు అందజేస్తారు.
ఆస్తిపన్ను మోత
ఏపీలో ఇప్పటికే పెరిగిన పన్నులు, ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో చేదు వార్త. త్వరలో ప్రభుత్వం పెంచిన ఆస్తిపన్ను మేరకు నోటీసులను అందిస్తోంది. ఈ మేరకు కొత్తగా సవరించిన ఆస్తిపన్ను కట్టాల్సి ఉంటుంది. వచ్చే ఆర్ధిక సంవత్సరం తొలి ఆరునెలలకు నోటీసులను ప్రభుత్వం జారీ చేస్తోంది. ఇందులో పెరిగిన ఆస్తిపన్ను కట్టాలని నోటీసులు ఇవ్వబోతున్నారు. దీంతో ప్రజలపై మరో భారం పడేందుకు సిద్ధంగా ఉంది. ఆస్తిపన్ను సవరణలో ఈసారి ప్రభుత్వం అమలు చేసిన విధానంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమైనా ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
ఆస్తిపన్ను పెరుగుదల ఇలా
ఆస్తిపన్నుఈసారి రెండు విధానాల్లో పెరగబోతోంది. ఇందులో మొదటిది గతంలో అమలు చేసిన ఆద్దె విలువ ఆధారిత పన్ను కాకుండా ఆస్తి మూలధన విలువ ఆధారంగా లెక్కించడం అయితే, నేరుగా ఆస్తిపన్ను పెంపు 10 నుంచి 15 శాతం ఉండబోతోంది. ఈ రెండు విధానాల ద్వారా ఆస్తిపన్ను మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. అసలే ప్రభుత్వ ఆదాయాలు నానాటికీ పడిపోతున్న క్రమంలో తప్పనిసరిగా ఈ మార్పులు చేయాల్సి వచ్చిందని సర్కార్ చెబుతోంది. కానీ సవరించిన పన్నులతో ప్రజల జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
డిమాండ్ నోటీసుల జారీ
సవరించిన ఆస్తిపన్ను కట్టాలంటూ పురపాలక సంస్ధలు, నగరపాలక సంస్ధలు ప్రజలకు డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నాయి. ఈ ప్రక్రియ నెలాఖరులోగా పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ నోటీసుల్లో తాజా విధానంతో జరిగిన మార్పుల్ని వివరించడంతో పాటు అద్దె విలువకు బదులుగా మూలధన విలువ ఆధారంగా లెక్కింపుతో జరిగిన మార్పుల్ని వివరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే స్ధానికంగా పన్ను ఎంత పెరిగిందనే అంశాన్ని కూడా ఈ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నట్లు చెప్తున్నారు. దీంతో వినియోగదారులకు ఎలాంటి గందరగోళం లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రిజిస్ట్రేషన్ విలువ పెరిగితే అదనపు మోత
ప్రస్తుతం జారీ చేస్తున్న ఆస్తిపన్ను నోటీసుల ప్రకారం ఇప్పుడున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా లెక్కించారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు పెంచితే మాత్రం అందుకు అనుగుణంగా ఆటోమేటిగ్గా సవరణలు కూడా తప్పవు. అంటే ఏపీలో ఇకపై ఆస్తిపన్ను భారం శాశ్వతంగా పెరుగుతూ పోవడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఐదేళ్ల కోసారి ఆస్తిపన్ను సవరణ చేయాలనే నిబంధన ఉండేది. అయినా అమలు చేసేవారు కాదు. ఎప్పుడు పడితే అప్పుడు పెంచుతూ పోయే వారు. ఇప్పుడు ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువతో లింక్ చేయడంతో ఇక ఏటా ఆస్తిపన్ను పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు.