ఐటీ శాఖకు నోటీసు: ఏపీ ఐటీ దాడులపై సీఎం రమేష్ ఆరా తీసిన మూడ్రోజుల్లోనే.. సోదాలపై ఏమన్నారంటే
కడప/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) సోదాలు కలకలం రేపుతున్నాయి. అంతకుముందు మరో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కంపెనీల్లో సోదాలు జరిగాయి. ఇప్పుడు సీఎం రమేష్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి.
కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని సీఎం రమేష్ నివాసంతో పాటు కడప, విజయవాడ, హైదరాబాదులలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. దీనిపై సీఎం రమేష్ ఘాటుగా స్పందించారు. తన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు.
సిఎం రమేష్ నివాసం, కార్యాలయాలపై ఐటి దాడులు...ఏకకాలంలో 25 చోట్ల సోదాలు
ఐటీ దాడులు ఎక్కడ, ఎందుకు.. పీఏసీ సభ్యుడిగా ఐటీ శాఖకు నోటీసు
ఐటీ శాఖ నోటీసులు ఇచ్చాకే, ఈ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు, దేశంలో ఎక్కడ, ఎందుకు ఐటీ దాడులు చేస్తున్నారని, అలాగే ఏపీలో దాడుల వివరాలకు ఇవ్వాలంటూ పీఏసీ సభ్యుడిగా సీఎం రమేష్ ఐటీ శాఖకు నోటీసులు కూడా ఇచ్చారు. సీఎం రమేష్ ఐటీ శాఖకు ఈ నోటీసులు ఇచ్చిన మూడ్రోజుల తర్వాత ఆయన కార్యాలయం, ఇళ్లపై సోదాలు జరిగాయి.
చెల్లించిన ఐటీ కంటే ఎక్కువ ఆస్తులు
హైదరాబాద్లోని రమేష్ ఇంట్లో 10 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు 25 నుంచి 30 చోట్ల ఏకకాలంలో వంద మంది ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన చెల్లించిన ఐటీ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించడం వల్లే ఈ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
తప్పుచేయలేదు, భయపడను
ఆదాయపన్ను శాఖ దాడులపై సీఎం రమేష్ స్పందించారు. ఐటీ దాడులకు ఎట్టి పరిస్థితుల్లోను భయపడే ప్రసక్తి లేదని ఢిల్లీలో ఉన్న ఆయన చెప్పారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలాగే దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల వెనుక ప్రత్యేక అజెండా ఉందని చెప్పారు.
ఇంట్లో లేని సమయంలో దాడులా, మీడియా సమక్షంలో జరగాలి
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయని సీఎం రమేష్ ఆరోపించారు. మీడియా సమక్షంలో ఐటీ దాడులు చేయాలని కోరుతున్నానని చెప్పారు. నేను ఇంట్లో లేని సమయంలో ఇలా దాడులు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. కాగా, కడప ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్ కేంద్రానికి వంద రోజులు గడువు పెట్టారు. ఆ గడువు పూర్తయింది.
Recommended Video