దిగొచ్చిన ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్..! విచారణకు సిద్ధమంటున్న డేటా డీలర్..!!
హైదరాబాద్: గత తెలుగుదేశం పార్టీలో నెలకొన్న రాజకీయ చిక్కుముడులు ఒక్కొక్కటి విడిపోతున్నాయి. పరిష్కారానికి నోచుకోని కొన్ని సమస్యలకు ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఓ కొలిక్కి వస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో కీలక నిందితుడుగా అనుమానిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ ఎట్టకేలకు దిగొచ్చారు. విచారణకు సిద్ధమంటూ ప్రత్యక్షమయ్యారు. విచారణకు సిద్ధమంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే విచారణలో భాగంగా సిట్ ఎదుట హాజరుకావాలని పోలీసులు సూచించారు. దీంతో గురువారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. గురువారం గోషామహాల్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు ఐటీ గ్రిడ్ ఎంపీ అశోక్.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీ ప్రజల డేటాను చోరీ చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై దాడులు నిర్వహించారు. దాడులలో ప్రజలకు సంబంధించిన కీలక డేటా స్వాధీనం చేసుకున్న తెలంగాణ పోలీస్ శాఖ. కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. డేటా చోరీ అంశం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణకు సిట్ ను నియమించింది. సిట్ విచారణకు హాజరుకావాలంటూ ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ కు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. కానీ అశోక్ విచారణకు హాజరుకాలేదు. అయితే ముందస్తు బెయిల్ కోసం ఇటీవలే తెలంగాణ హైకోర్టును అశోక్ ఆశ్రయించారు. మెుత్తానికి ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ సిట్ విచారణకు సిద్ధమవ్వడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.