ఇక మన పని ముగిసింది..!కూల్చివేతపనులు మొదలుపెట్టండన్న ఏపీ సీఎం
అమరావతి/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఉండవల్లిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అది అక్రమ, అవినీతి కట్టడమని ఆరోపించారు. సోమవారం ఇదే ప్రజావేదికలో మొదలైన కలెక్టర్ల భేటీలో ఆయన ప్రసంగించారు. 'ఇక్కడి నుంచే ఆదేశాలిస్తున్నా.. ఇలాంటి అక్రమ, అవినీతి భవనంలో ఇదే చివరి సమావేశం కావాలి. మంగళవారం కలెక్టర్ల సదస్సు ముగియగానే దీన్ని కూల్చేయండి. ఇవాళ పరిస్థితులు ఒక్కసారి మనం గమనించాలి.
ఏ స్థాయిలో వ్యవస్థ దిగజారిపోయిందో చూడాలి. మనం ఇక్కడ ఈ హాల్లో సమావేశం అయ్యాం. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు, శాఖాధిపతులు ఇంతమందిమి ఇక్కడే కూర్చున్నాం. ఈ భవనం చట్టపరంగా సరైందేనా? నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా, అవినీతితో కట్టిన భవనమిది. ఒక అక్రమ నిర్మాణంలో సమావేశం పెట్టుకుంటున్నాం. కృష్ణా నది వరద మట్టం ఇక్కడ 24 మీటర్లు. కానీ ఈ భవనం ప్రస్తుతం ఉన్న స్థాయి 19 మీటర్లు. అందువల్ల ఇక్కడ గ్రీవెన్సు హాల్ నిర్మించవద్దని కృష్ణా సెంట్రల్ డివిజన్ ఈ గత ప్ర భుత్వానికి లేఖ రాశారని ఏపి సీఎం జగన్ గుర్తు చేసారు.
గత ప్రభుత్వ తప్పిదాలు..! నదీ పరిరక్షణ చట్టాన్ని పట్టించుకోలేదన్న అదికారులు..!!
దీని నిర్మాణంలో నదీ పరిరక్షణ చట్టాన్ని కూడా పట్టించుకోలేదు. లోకాయుక్త సిఫారసుల నూ పట్టించుకోలేదు. చివరకు నిర్మాణంలో కూడా అవినీతి జరిగింది. భవన నిర్మాణ అంచనాలు 5 కోట్లనుంచి 8.9 కోట్ల రూపాయలకు పెంచారు. ఇది చూపించడానికే అందరినీ ఇక్కడకు సమావేశానికి రావాలన్నాను. మన ప్రవర్తన ఎలా ఉండాలో ఆత్మపరిశీలన చేసుకోవడానికే ఇక్కడ సమావేశం పెట్టాం. ఒక అక్రమ నిర్మాణంలో కూర్చుని, పర్యావరణ చట్టాలు, గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు, నదీ పరిరక్షణ చట్టాలు.. అన్నీ ప్రభుత్వమే దగ్గరుండి ఉల్లంఘించింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని గుర్తుంచుకోవాలి. ఎవరైనా చిన్నవాళ్లు ఇదే పనిచేసి ఉంటే ఏం చేసేవాళ్లం? అక్రమ నిర్మాణంపై ప్రశ్నించేవాళ్లం. ఎవరైనా బలహీనులు ఈ పనిచేస్తే అక్కడకు వెళ్లి ఆ నిర్మాణాన్ని తొలగి స్తాం. కానీ మనమే ముఖ్యమంత్రిగా ఉండి.. నిబంధనలను, నియమాలను ఉ ల్లంఘిస్తే.. అంతరాత్మను ప్రశ్నించుకోవాలని సీఎం అన్నారు.
ప్రజాస్వామ్య పరిహాసం..!ఇలాంటి వాటిని గుర్తించి కూల్చేయండని సీఎం ఆదేశాలు..!!
ఈ ప్రజా వేదిక హాలులో ఇదే చివరి మీటింగ్ అనిఏపి సీఎం అన్నారు. మొదటి అక్రమ నిర్మాణం కూల్చివేత ఇక్క డి నుంచే ప్రారంభం కావాలి. మనం ఒక ఉదాహరణగా నిలిచిపోవాలి. మీ మీ జిల్లాలకు వెళ్లినప్పుడు.. పరిశీలన చేయండి. ఇలాంటి అక్రమ కట్టడాలుంటే కూల్చేయండి అని కలెక్టర్లను నిర్దేశించారు.గత ఐదేళ్లలో ప్రజలకు చెడ్డ సంకేతాలు వెళ్లాయని సీఎం అన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. అక్కడి తో ఆగలేదు. వారికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. నలుగు రు మంత్రులయ్యారు. ఇదే కలెక్టర్లు, అధికారులపై వారు అధికారం చలాయించారు. ఇది ప్రజాస్వామ్య పరిహాసం. చట్టాలను మనమే అమలు చేయకుంటే.. ఇక ప్రజలకు ఏం చెబు తాం? మనం తప్పు చేస్తాం.. కానీ ప్రజలు మాత్రం పాటించాలంటే ఎలా? గత ప్రభుత్వం వ్యవస్థను దిగజార్చింది. దానిని మార్చాలి. ప్రభుత్వ ఉద్యోగులంటే గౌరవం పెరగాలన్నారు.
ఏమిటీ ప్రజావేదిక..? దీని నిర్మాణం ఉద్దేశం ఏంటి..?
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదిలి అమరావతి వచ్చిన కొత్తలో ఇక్కడ స మావేశం నిర్వహించుకునేందుకు ఒక్క భవనమూ లేదు. అధికారులతో భేటీలు, కలెక్టర్ల సదస్సులు, పెట్టుబడిదారులతో భే టీల నుంచి ప్రజల ఫిర్యాదులు స్వీకరించడం వరకు.. అన్నీ విజయవాడలోని ప్రైవేటు హోటళ్లు, చుట్టుపక్కల ఉన్న ఫంక్షన్ హాళ్లలోనే పెట్టుకోవాల్సి వచ్చేది. దాదాపు ఏడాదిన్నర అలాగే నడిచింది. ఆ తర్వాత ప్రభుత్వమే ఒక సమావేశ మందిరం నిర్మించాలని నిర్ణయించింది. ఉండవల్లి కరకట్టను ఆనుకుని నాటి సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న పక్కనే ఒక భవనం నిర్మించి.. దానికి ప్రజావేదికగా పేరుపెట్టింది. సీఆర్డీఏ కొద్దినెలల్లోనే ఈ నిర్మాణం పూర్తిచేసింది. ఒక భారీ హా లు, ఎత్తైన వేదిక, కొన్ని గదులు, ఆవరణలోనే మరికొన్ని చిన్న నిర్మాణాలు ఉన్నాయి. కలెక్టర్ల సదస్సులు, పెట్టుబడిదారులతో ఒప్పందాలు, ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించడం.. ఇలాంటి వాటికి దీనిని ఉపయోగిస్తూ వచ్చారు.
ఎస్పీల భేటీ ముగియగానే ఏసీలు, ఫర్నిచర్ తరలింపు..! ప్రజావేదిక కూల్చివేత రేపే..!!
ప్రజావేదికను తొలగించే కార్యక్రమం బుధవారమే ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇందులో నిర్వహిస్తున్న కలెక్టర్ల సద స్సు మంగళవారం ముగియనుంది. మధ్యాహ్నానికి ఎస్పీల తో సమావేశం కూడా పూర్తవుతుంది. ఆ వెంటనే పజావేదికలో అమర్చిన ఏసీలు, ఇతర ఉపకరణాలు, ఫర్నిచర్ తదితరాలను సీఆర్డీఏ అక్కడి నుంచి తరలించనున్నట్లు సమాచారం. అనంతరం బహుశా బుధవారంనాటి నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టి.. సాధ్యమైనంత త్వరగా ముగిస్తారని తెలిసింది.