కరోనా విషయంలో వాస్తవాలను తొక్కి పెట్టటం మంచిది కాదు : జగన్ కు చంద్రబాబు లేఖ
ఏపీలో కరోనా మహమ్మారి ఊహించని విధంగా ప్రబలుతుంది . ఇప్పటికి 132 కి చేరింది ఏపీలో కేసుల సంఖ్య. ఇక ఈ నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబు తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చెయ్యాలని సూచించారు. సీఎం జగన్కు ప్రతిపక్ష నేత చంద్రబాబు కరోనా అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని హితవుపలికారు.
ఇక ఇప్పటికే ఏపీలో కేసులు పెరిగిపోయాయని వైరస్ వేగం పుంజుకుందని పేర్కొన్న చంద్రబాబు, కరోనా నివారణను సవాల్గా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. పాజిటివ్ కేసులను దాచిపెడుతున్నారన్న ప్రచారం ఉందని, స్థానిక వాస్తవాలను తొక్కిపెట్టడం మంచిదికాదని హితవుపలికారు. ఏపీలో ల్యాబ్లు పెంచాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని, ఇక ఢిల్లీ నిజాముద్దీన్ సభకు వెళ్లి వచ్చిన వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని, కరోనా కేసులు పెరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఉపాధి కోల్పోయిన పేదలు పస్తులు ఉండకుండా అన్న క్యాంటీన్లు తెరిచి వారిని ఆదుకోవాలని పేర్కొన్నారు చంద్రబాబు . ఓ వైపు ప్రభుత్వం భౌతిక దూరం పాటించాలని చెబుతూనే రేషన్ పేరుతో జనాల్ని ఒకే చోటుకు చేర్చడం సరికాదన్నారు. రేషన్ ఇళ్లకే వెళ్లి ఇచ్చి రావాలని సూచించారు. వైద్యులు, సిబ్బందికి పీపీఈలు అందజేయాలని, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం సరికాదని చంద్రబాబు చెప్పారు.శరవేగంగా విస్తరిస్తున్న ఏడు రాష్ట్రాల్లో ఏపీని కూడా చేర్చారని, ఇది మరింత ఆందోళనకరమని పేర్కొన్న చంద్రబాబు జగన్ కు కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చెయ్యాలని వరుస లేఖలు రాస్తున్నారు.