నారా లోకేష్ నామినేషన్ దాఖలు: తల్లిదండ్రులు ఆశీర్వాదం..ఎదురొచ్చిన బ్రాహ్మణి
Recommended Video
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు జిల్లాలోని మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను ఆరంభించిన లోకేష్..తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు.
నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ఈ ఉదయం ఉండవల్లిలోని అధికారిక నివాసం నుంచి ఆయన ర్యాలీగా బయలుదేరారు. అంతకుముందు- తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. తల్లి భువనేశ్వరి, తండ్రి చంద్రబాబు నాయుడులకు పాద నమస్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు భార్య బ్రాహ్మణి ఎదురొచ్చారు. అనంతరం- వేద పండితులు నారా లోకేష్ కు ఆశీర్వచనాలు పలికారు. దిష్టి తీసి, సాగనంపారు. తల్లిదండ్రుల ఆశీర్వాద బలం ఉంటే.. ఎంతటి కష్టమైన పనైనా సులభంగా పూర్తవుతుందని తాను విశ్వసిస్తున్నట్లు లోకేష్ చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు (ఫొటోలు)
నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొనడం ఇదే తొలిసారి. ఇదివరకు ఎమ్మెల్సీగా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. కీలకమైన ఐటీ, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు మంత్రిగా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో..అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. దీనికి ముందు- పెదకూరపాడు, పెనుమలూరు, భీమిలి, విశాఖ నార్త్, నంద్యాల, కర్నూలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయవచ్చంటూ లీకులు వెలువడ్డ విషయం తెలిసిందే. అవేవీ అంత సురక్షితం కావని తేట తెల్లం కావడంతో చివరికి- రాజధాని ప్రాంతానికి ఆనుకుని ఉన్న మంగళగిరిని ఎంచుకున్నారు.