లోకేష్ ఆస్తుల ప్రకటన: బాబువి రూ.2.5 కోట్లు, బ్రాహ్మణివి రూ.15 కోట్లు, ఎవరి ఆస్తులు ఎంత?
Recommended Video
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం తమ కుటుంబం ఆస్తులను ప్రకటించారు. వరుసగా తాము తమ ఆస్తులను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మరే కుటుంబం కూడా ఇలా ప్రతి ఏటా ఆస్తులను కట్టలేదన్నారు.
తన తండ్రి చంద్రబాబు ఆస్తుల్లో పెద్దగా మార్పులు లేవని చెప్పారు. హైదరాబాదులో ఇంటి నిర్మాణానికి రూ.4 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చంద్రబాబుకు రూ.3 కోట్ల అప్పులున్నాయన్నారు. తమ ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం మారుతుంటాయని చెప్పారు.
హైదరాబాద్లో ఇల్లు కట్టాం
హైదరాబాదులో ఇంటిని కూల్చివేసి కొత్త ఇల్లు కట్టినట్లు లోకేష్ చెప్పారు. ఇందుకు రూ.4 కోట్లు ఖర్చయిందని తెలిపారు. తమ కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు హెరిటేజ్ అని చెప్పారు. పద్ధతి ప్రకారం వ్యాపారం చేయడం తప్పు కాదన్నారు. తమ కుటుంబం ఎనిమిదేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తుందన్నారు.
చంద్రబాబు ఆస్తులు
తన తండ్రి చంద్రబాబు ఆస్తుల్లో పెద్దగా తేడాలు లేవని లోకేష్ చెప్పారు. చంద్రబాబు పేరిట రూ.3.58 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు నికర ఆస్తులు రూ.2.53 కోట్లుగా ఉందని చెప్పారు. ప్రావిడెంట్ ఫండ్ రూ.30 లక్షలు పెరిగిందని చెప్పారు.
భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.25.41 కోట్లు
తన తల్లి భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.25.41 కోట్లుగా ఉందని నారా లోకేష్ చెప్పారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తుల విలువ మారుతుందన్నారు. తాము హెరిటేజ్ను 1992లో ప్రారంభించామని లోకేష్ చెప్పారు. ఇప్పుడు అది రూ.2600 కోట్ల టర్నోవర్కు పెరిగిందన్నారు.
లోకేష్ ఆస్తుల విలువ రూ.15.25 కోట్లు
తన పేరిట రూ.15 కోట్ల 25 లక్,ల ఆస్తులు ఉన్నాయని లోకేష్ చెప్పారు. తమపై ఆరోపణలు చేసేవారు ఆస్తులు ప్రకటించాలని లోకేష్ సవాల్ చేశారు.
బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ.15.01 కోట్లు
తన భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ.15.01 కోట్లుగా ఉందని లోకేష్ తెలిపారు. తాము తమ ఆస్తుల కొనుగోలు ధరలను ప్రకటిస్తున్నామని చెప్పారు.
దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.11.54 కోట్లు
తన తనయుడు దేవాన్ష్ ఆస్తుల్లో పెద్దగా మార్పు లేదని నారా లోకేష్ ప్రకటించారు. దేవాన్ష్ పేరిట రూ.11.54 కోట్లు ఉందని తెలిపారు.
జగన్కు చురకలు
వైసీపీ అధినేత వైయస్ జగన్, ఆయన పార్టీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని మొదట వాళ్లు ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతరులపై విమర్శలు చేసే ముందు మేం ఆ పని చేస్తున్నామా అని ఆలోచించాలన్నారు. ఆ తర్వాత తమ తప్పులు ఉంటే ఆరోపణలు చేయాలన్నారు. వైయస్ జగన్ ఆస్తులను ఈడీ, సీబీఐ ప్రకటిస్తున్నాయని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ ఎప్పుడూ సొంతంగా ఆస్తులు ప్రకటించలేదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హెరిటేజ్ పైన 17 కేసులు వేశారని, కానీ ఒక్క దానిని నిరూపించలేకపోయారన్నారు.