భరత్ హంగామా, అంతలోనే: టీజీకి లోకేష్ ఊహించని షాక్, వైసీపీ వాళ్లకే!
Recommended Video
కర్నూలు: తన జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్ 2019కి గాను కర్నూలు లోకసభ, అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కర్నూలు శాసన సభకు ఎస్వీ మోహన్ రెడ్డి, ఎంపీగా బుట్టా రేణుక పోటీ చేస్తారని తెలిపారు. దీంతో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వర్గం అసంతృప్తికి లోనైంది. రాబోయే ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు ఉంటాయని, ఓ ఓటు మోహన్ రెడ్డికి, మరో ఓటు బుట్టా రేణుకకు వేసి భారీగా మెజార్టీతో గెలిపించాలని లోకేష్ అన్నారు.
కర్నూలు అభ్యర్థులుగా బుట్టా, ఎస్వీలను ప్రకటించిన లోకేష్: పవన్కు కౌంటర్
వారిని సభలకు పంపించే బాధ్యత తనది అన్నారు. ఎవరూ ఊహించని విధంగా లోకేష్ ఈ ప్రకటన చేసారు. కర్నూలు అసెంబ్లీ స్థానం టిక్కెట్ను ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వీతో పాటు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ ఆశిస్తున్నారు. సర్వే ఆధారంగా సీఎం చంద్రబాబు టిక్కెట్ ఇస్తారని, అది టీజీ భరత్కే వస్తుందని టీజీ వర్గీయులు ఆశిస్తున్నారు.
లోకేష్ ఎలా చెప్పినా, ఊహించని షాకే
ఈ నేపథ్యంలో నారా లోకేష్ స్థానిక ప్రజాప్రతినిధులు కాబట్టి వారి పేర్లను యథాలాపంగా చెప్పారా, లేక ప్రకటన చేసినట్లేనా అనే చర్చ సాగుతోంది. మొత్తానికి లోకేష్ ప్రకటన ఊహించనిది అంటున్నారు. అయితే లోకేష్ బహిరంగ ప్రకటన చేయడం టీజీ వర్గీయులను కొంత అసంతృప్తికి గురి చేసిందని చెబుతున్నారు. మరోవైపు, ఎస్వీ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదీ విషయం
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీజీ వెంకటేష్ బరిలో నిలిచారు. వైసీపీ నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత టీజీ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీ నుంచి ఎస్వీ టీడీపీలో చేరారు. తొలుత ఆయన చేరికను టీజీ వ్యతిరేకించారు. చంద్రబాబు సర్ది చెప్పడంతో మెత్తబడ్డారు. టీజీకీ రాజ్యసభ టిక్కెట్ ఇవ్వడంతో వచ్చే ఎన్నికల్లోను ఎస్వీకే టిక్కెట్ అని చాలామంది నిర్ణయానికి వచ్చారు.
రేసులోకి టీజీ భరత్
అయితే, ఆ తర్వాత టీజీ వెంకటేష్ అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో తన అభిప్రాయం చెప్పారు. కర్నూలు అసెంబ్లీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని చెప్పారు. తన తనయుడు టీజీ భరత్ బరిలో నిలుస్తాడని సన్నిహితులతో చెబుతున్నారు. ఇప్పుడు లోకేష్ ప్రకటన టీజీ వర్గీయుల్లో అసంతృప్తిని రగిల్చింది.
టీజీ వెంకటేష్ ఏం చేస్తారు?
లోకేష్ చెప్పిందే నిజమైతే టీజీ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆ సీటును వదులుకునేందుకు ఆయన సిద్ధంగా లేరని అంటున్నారు. మరో విషయం ఏమంటే సోమవారం లోకేష్ కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు టీజీ భరత్, ఆయన వర్గీయులు చాలా 100 మీటర్ల దండ తీసుకు వచ్చారు. క్రేన్ సాయంతో గజమాలతో లోకేష్ను సన్మానించారు. టీజీ భరత్ యువసేన బైక్ ర్యాలీ నిర్వహించింది. రోడ్డంతా టీజీ వెంకటేష్, భరత్ ఫ్లెక్సీలే కనిపించాయి. కానీ అంతలోనే లోకేష్ షాకిచ్చారు. కర్నూలు సీటు ఇవ్వకుంటే టీజీ.. అధిష్టానం నిర్ణయం మేరకు తప్పుకుంటారా, వైసీపీ నుంచి పోటీ చేస్తారా లేదా జనసేన వైపు చూస్తారా అనే చర్చ సాగుతోంది. ఆ పార్టీలోని వారు కూడా చేర్చుకుంటారా అనేది మరో విషయం. కొడుకును రాజకీయ ప్రవేశానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలితే ఆయన మౌనంగా ఉంటారని ఎవరూ అనుకోరు. కాబట్టి ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.
బుట్టా రేణుకకు టిక్కెట్.. ఆశావహులకు చెక్
వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుక ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. ఇప్పుడు లోకేష్ ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. రేణుక ఎమ్మిగనూరు వెళ్తే.. ఆ టిక్కెట్ పైన కేఈ ప్రభాకర్, బీటీ నాయుడులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశావహులకు బ్రేక్ పడినట్లే. లోకేష్ ప్రకటనతో కర్నూలు టీడీపీలో కలకలం చేలరేగినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి.