చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లు, కార్యాలయాల్లో కొనసాగుతోన్న సోదాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావు ఇళ్లు కార్యాలయాలపై రెండురోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హైదరాబాద్ చంపాపేట, విజయవాడ గాయత్రీనగర్ కంచుకోట అపార్ట్మెంట్లో సోదాలు చేస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి పలు కీలక డాక్యుమెంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మాజీ పీఎస్..
శ్రీనివాసరావు 2019 ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు పీఎస్గా పనిచేశారు. ప్రస్తుతం జీఏడీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం రూ.150 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాసరావు ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తే ప్రతికూలత ఎదురవుతుందనే ఉద్దేశంతో ఢిల్లీ నుంచి సీఆర్పీఎఫ్ సిబ్బందిని తమ వెంట తీసుకొచ్చారు.
కీ రోల్..
గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ పనులను కేటాయించడంలో శ్రీనివాస్ కీ రోల్ పోషించారు. గుత్తేదారులకు పనులు కేటాయించి ఆస్తులు కూడబెట్టారని ఐటీ అధికారులు భావిస్తున్నారు. శ్రీనివాసరావుతోపాటు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు సన్నిహితుల ఇళ్లలో ఐటీ దాడుల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు గురవుతున్నారు.
పోలీసులకు నో పర్మిషన్
ఐటీ అధికారుల సోదాలపై విజయవాడ పరిధిలోని మాచవరం పోలీసులు ఆరాతీశారు. ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నట్టు సీఆర్పీఎఫ్ సిబ్బంది పేర్కొన్నారు. కానీ పోలీసులను కూడా వారు లోపలికి అనుమతించ లేదు. దీంతో స్థానికులను ఎవరినీ పర్మిషన్ ఇవ్వబోమని సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ఇవాళ రాత్రి శ్రీనివాస రావుతోపాటు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను తీసుకొని ఐటీ అధికారులు హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది.