ఐటీ రైడ్స్ 5వ రోజు: చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో కొనసాగుతోన్న సోదాలు, జీఎస్టీ, ఈడీ అధికారులు కూడా?
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాసరావు ఇంట్లో వరుసగా ఐదోరోజు సోదాలు కొనసాగుతోన్నాయి. అమరావతిలో గల గాయత్రీనగర్ కంచుకోట అపార్ట్మెంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఒకటి లేదంటే రెండురోజుల్లో సోదాలు పూర్తవుతాయి.. కానీ ఐదు రోజుల నుంచి తనిఖీలు కొనసాగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
పోలీసులకు కూడా..
సీఆర్పీఎఫ్ బలగాలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రైడ్ చేసే సమయంలో లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. స్థానిక పోలీసులను కూడా అలో చేయడం లేదు. సోదాల్లో ఎంత డబ్బు లభించింది..? డాక్యుమెంట్ల మొత్తం ఎంత..? తదితర అంశాలను వెల్లడించడం లేదు. సోదాల వివరాలను మాత్రం ఐటీ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఐటీ అధికారులు కీలక పత్రాలు సేకరించినట్టు తెలుస్తోంది. గత 96 గంటల నుంచి శ్రీనివాసరావును ఐటీ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకు సోదాలు జరిగే అవకాశం ఉంది.
జీఎస్టీ, ఈడీ కూడా..?
ఐటీ అధికారులతో పాటు జీఎస్టీ, ఈడీ అధికారులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. కానీ దీనిని ఐటీ అధికారులు మాత్రం ధృవీకరించడం లేదు. ఎన్నికలకు ముందు నగదు బదిలీ జరిగిందని.. ఫండ్ ట్రాన్స్ఫర్ జరిగిన సమయంలో సంభాషణలకు సంబంధించి వివరాలు సేకరించారు. అందులో శ్రీనివాస్ నంబర్ కూడా ఉండటంతో సోదాలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపైనా కూడా క్లారిటీ లేదు.
సీఆర్పీఎఫ్ భద్రత మధ్య..
శ్రీనివాసరావు 2019 ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు పీఎస్గా పనిచేశారు. ప్రస్తుతం జీఏడీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. శ్రీనివాసరావు ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తే ప్రతికూలత ఎదురవుతుందనే ఉద్దేశంతో ఢిల్లీ నుంచి సీఆర్పీఎఫ్ సిబ్బందిని తమ వెంట తీసుకొచ్చారు.