సంచలనం:ఎపిలో ఐటి దాడులు మొదలు...వివిధ ఆఫీసులు,స్థావరాల్లో సోదాలు
విజయవాడ:ఊహించినట్లే ఆంధ్రప్రదేశ్ లో ఐటీ దాడులు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి గురువారం రాత్రి సమయానికే పెద్ద సంఖ్యలో విజయవాడకు చేరుకొని హోటళ్లలో బసచేసిన ఐటీ అధికారులు శుక్రవారం ఉదయమే దాడులు ప్రారంభించారు. అయితే ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ, మీడియా వ్యవహరించిన తీరును ప్రజాసంఘాలు తప్పుబడుతున్నాయి.
దాడుల సందర్భంగా తమకు బందోబస్తు కావాలని పోలీసులను ఐటి శాఖ అధికారులు కోరారని, దీంతో వారు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారని...అప్పటినుంచి మీడియాలో దాడుల విషయమై అక్రమార్కులను అప్రమప్తం చేస్తున్న తరహాలో స్క్రోలింగ్స్ వచ్చాయని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా సొమ్ము కూడబెట్టిన వారిపైనే ఐటి శాఖలు దాడులు చేస్తాయని, అలాంటి వారిని కాపాడే తరహాలో కొన్ని మీడియా సంస్థలు ఇలా వ్యవహరించడం ఏ విధంగా సమర్థనీయమని వారు నిలదీస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
మీడియాలో దాడుల విషయమై
విజయవాడ, గుంటూరులో ఐటి శాఖ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం ఉదయమే విజయవాడ ఆటోనగర్ కార్యాలయంలో సమావేశమైన ఐటి శాఖ అధికారులు అక్కడే కార్యచరణను రూపొందించుకొని అనంతరం అక్రమార్కుల వేటకు బయలుదేరారని తెలిసింది. ముందుగా విజయవాడ, గుంటూరులోని కన్స్ట్రక్షన్ ఆఫీసుల్లో ఐటి అధికారులు తనిఖీలు,సోదాలు మొదలుపెట్టారు. తొలుత సదరన్, వీఎస్ లాజిస్టిక్స్ కంపెనీల్లో, జగ్గయ్యపేట సమీపంలోని ఒక సిమెంట్ బ్రిక్స్ తయారీ కంపెనీల్లోనూ సోదాలు జరుగుతున్నాయని తెలిసింది. మొత్తం 8 ఐటి బృందాలు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు
ఇక ఎపిలో ఐటి దాడులు జరగబోతున్నాయంటూ గురువారం రాత్రి నుంచే కొన్ని టివి ఛానెళ్లు బ్రేకింగ్ లతో హోరెత్తించడంతో చాలా మంది ప్రముఖులు అప్రమప్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఎపిలో ముందుగా నెల్లూరు జిల్లాలో టిడిపి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు, ఆయన సోదరుడు రవిచంద్రలకు సంబందించిన రొయ్యల సంస్థల పై ఐటి శాఖ దాడులు చేసి...వారి విదేశీ వ్యాపార లావాదేవీలపై ఆరా తీశారని తెలిసింది. అంతకుముందు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డిపై ఐటి దాడుల సంగతి తెలిసిందే. ఆ తరువాత గురువారం రాత్రికి విజయవాడ చేరుకున్న ఐటి బృందాలు విజయవాడ,గుంటూరులోని పలువురు రాజకీయ నేతల ఇళ్లపై దాడులు జరపనున్నాయని టివి ఛానెళ్లు స్క్రోలింగ్స్ తో హోరెత్తించాయి.
ఒక్కసారిగా విరుచుకుపడేందుకు ఐటి అధికారులు రంగం సిద్ధం
అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటున్న ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లపై ఒక్కసారిగా విరుచుకుపడేందుకు ఐటి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఒక మీడియా సంస్థ ప్రత్యేక కథనం కూడా ఇచ్చింది. ఇందుకోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ సిబ్బంది సంసిద్దమైనట్లు పేర్కొంది. రాజధాని ప్రాంతంలో భూ లావాదేవీలు జరిపిన, పన్నులు కట్టలేదని భావిస్తున్న కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలతో ఐటి శాఖ ఒక జాబితా రూపొందించుకుందని, ఇందులో పలువురు ప్రముఖ ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నట్లు ఆ మీడియా సంస్థ హెచ్చరిస్తోంది.
పోలీస్ అధికారుల హస్తం ఉన్నట్లు
ఇక ఐటి దాడుల విషయం మీడియాకు ముందుగా లీక్ కావడం వెనుక కొందరు పోలీస్ అధికారుల హస్తం ఉన్నట్లు ప్రజా సంఘాల నేతలు భావిస్తున్నారు. మేము అవాంతరాలు ఎదుర్కోకుండా సజావుగా సోదాలు జరిపేందుకు వీలుగా తగిన బందోబస్తు కల్పించాలని స్థానిక పోలీసు యంత్రాంగాన్ని ఐటి అధికారులు కోరారట. దాడుల గురించి మీకు ఒక అరగంట ముందు చెబుతామని...మీరు వెంటనే మాతోపాటు కలిసి దాడుల ప్రదేశానికి రావాలని...బందోబస్తు కల్పించాలని అడిగారట. దీంతో అలా సమాచారం అందుకున్న పోలీసుల్లో కొందరు ఈ విషయాన్ని మీడియాకు తెలపడంతో వారు స్క్రోలింగ్స్ వేయడం వల్ల అనేకమంది అక్రమార్కులు అప్రమప్తమై దాడుల్లో అక్రమార్జన పట్టుబడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిఉంటారనేది ప్రజాసంఘాల నేతల వాదన.