ఎన్నికల వేళ షాక్: కనిగిరి టీడీపీ అభ్యర్థికి చెందిన ఆస్పత్రిపై ఐటీ దాడులు
గుంటూరు: ఏపీలో ఎన్నికల వేళ నాయకులపై ఐటీ దాడులు ముమ్మరం అవుతున్నాయి. మొన్న మంత్రి నారాయణ పై ఐటీ దాడులు జరిగిన కొద్ది రోజుల్లోనే మరో టీడీపీ నేత కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డికి చెందిన ఆస్పత్రిలో ఐటీ దాడులు జరిగాయి. ఉగ్రనరసింహారెడ్డికి చెందిన అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.
ఇదిలా ఉంటే ఉగ్రనరసింహారెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయన ఆస్పత్రిపై ఐటీ అధికారులు దాడి చేశారు. అయితే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ వారిపై ఐటీ దాడులు జరుగుతుండటం ఆ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం మంత్రి నారాయణ సంస్థలపై కూడా ఐటీ దాడులు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు టీడీపీలో ఉన్న సమయంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి పై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఐటీ దాడులు జరగడంతో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పారు. అయితే ఆ తర్వాత మాగుంట శ్రీనివాసులు వైసీపీలో చేరారు.
కనీస ఆదాయం పథకం అమలు చేయొచ్చు ..కండీషన్స్ అప్లై: రఘురాంరాజన్
ఎన్నికల వేళ ఐటీ దాడులు కేవలం రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయని టీడీపీ మండిపడుతోంది. తమ అభ్యర్థులపై ఐటీ దాడులు చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోందని కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు చెప్పారు. కర్నూలులో పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అయితే దాడులకు తాము భయపడేది లేదని చెప్పారు. జగన్కు లాభం కూర్చేందుకే కేంద్రం ఇలాంటి దాడులు చేస్తోందని టీడీపీ మండిపడింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఉగ్రనరసింహారెడ్డిని తమ ముందు హాజరై వివరణ ఇవ్వమని ఐటీ అధికారులు కోరే అవకాశం ఉంది. అలా కానిచో ఆయనకు నోటీసులు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల వేళ టీడీపీని నైతికంగా దెబ్బకొట్టేందుకు కేంద్రం ఐటీని పావుగా వాడుకుంటోందని టీడీపీ విమర్శిస్తోంది.