నవయుగ కంపెనీపై ఐటీ సోదాలు...పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న కంపెనీ
తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఐటీ అధికారులు దాడులను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 8గంటల నుంచి హైదరాబాద్లోని నవయుగా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 20 మంది సభ్యులతో కూడిన ఐటీ బృందం ఈ తనిఖీలను నిర్వహిస్తోంది. గత నాలుగేళ్లుగా ఐటీ రిటర్న్స్ , ప్రాజెక్టుల నిర్వహణపై ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. అంతేకాదు నవయుగ సంస్థకు చెందిన 47 కంపెనీల లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
నవయుగ కంపెనీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నిబంధనలను పాటిస్తుందా లేదా అనేదానిపై కూడా ఐటీ అధికారులు దృష్టి సారించారు. అయితే ఆర్వోసీ నిబంధనలను కంపెనీ ఉల్లంఘించిందని అధికారులు వెల్లడించారు. నవయుగ బెంగళూరు టోల్వే కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే మళ్లీ కొద్ది రోజుల తర్వాత ఐటీ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఇటీవల టిడిపి నేతలు సుజనాచౌదరి, పోతుల రామారావు, సిఎం రమేష్ తదితరుల ఇళ్లపై దాడులు నిర్వహించిన ఐటి అధికారులు..ఇప్పుడు మరోసారి భారీ స్థాయిలో దాడులు జరిపేందుకు పక్కా ప్లాన్ రచించుకున్నారని తెలిసింది. ఈ దాడులు రెండు మూడు రోజులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈసారి దాడుల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక టిడిపి నాయకుడిని టార్గెట్ చేయడం ఖాయమని వదంతులు వినిపిస్తున్నాయి. పారిశ్రామికవేత్త అయిన ఆయన ఇటీవలే టిడిపిలో చేరారని...అంతకుముందు వైసిపిలో ఉండేవారని...వైసిపి ముఖ్యనేతల కోరిక మేరకు ఐటి ఆయనని టార్గెట్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అలాగే రాజధాని ప్రాంతానికి చెందిన ఓ రాష్ట్ర మంత్రిపై కూడా దాడులు నిర్వహించవచ్చని మరో ప్రచారం.