విశాఖ:పేరం గ్రూప్ అధినేత నివాసంపై ఐటి సోదాలు...హరిబాబుపై దాడులు అందుకేనా?
విశాఖపట్నం:ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న గుంటూరులో టీడీపీ నేత, ఎల్వీఆర్ క్లబ్ కార్యదర్శి గ్యాస్ నాని నివాసంలో తనఖీలు జరిపిన ఐటీ అధికారులు ఈరోజు విశాఖలో తమ సోదాలు చేపట్టారు.
విశాఖలో పేరం గ్రూప్ అధినేత, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ సమీప బంధువు హరిబాబు కు చెందిన నివాసం, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే తిరుపతి, హైదరాబాద్లోని హరిబాబుకు సంబంధించిన ప్రాంతాల్లోనూ ఈరోజు ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిసింది.
వీటితో పాటుగా హైదరాబాద్లోని మంజీరా మెజిస్టిక్ మాల్లోని పేరం గ్రూపు ప్రధాన కార్యాలయంలో కూడా కొద్దిసేపటి క్రితమే ఐటి అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. అలాగే పేరం గ్రూప్ అధినేతకు సంబంధించిన జీజీఆర్ హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లోనూ సోదాలు జరుగుతున్నాయని సమాచారం. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్ సమీపంలోని పేరం రియల్ ఎస్టేట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
పేరం హరిబాబు చేస్తున్న వ్యాపారానికి, ఆయన ప్రభుత్వానికి చెల్లించే పన్నులకు తీవ్ర వ్యత్యాసం ఉందనే అనుమానంతో ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లుగా సమాచారం. అయితే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అనుమానం రావడంతో ఐటీ అధికారులు సోదాలకు దిగారనేది మరికొందరి వాదన. ఈ సోదాల్లో ఐటి అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక పేరం గ్రూపు అధినేత హరిబాబు స్వస్థలం తిరుపతి కాగా ఈయన గుంటూరు జిల్లా గురజాల టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కు వియ్యంకుడు కావడం గమనార్హం. అంతేకాకుండా పేరం హరిబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సన్నిహితుడుగా వైసిపి నేతలు చెబుతున్నారు.