ఏపీలో కూడా అనుమతులు లేకుండా?: నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు
అమరావతి: నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహిస్తున్నారు. విజయవాడ సహా కొన్ని ప్రధాన ప్రాంతాల్లోని ఈ రెండు విద్యాసంస్థలపై ఈ తెల్లవారు జాము నుంచి దాడులు కొనసాగిస్తున్నారు. విస్తృతంగా సోదాలను చేపట్టారు. కొన్ని విద్యాసంస్థల క్యాంపస్ల నుంచి కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు బందోబస్తు మధ్య కళాశాల సిబ్బందిని బయటకు పంపించిన ఐటి అధికారులు కార్యాలయాల్లోని రికార్డులన్నింటినీ పరిశీలిస్తున్నారు.
విజయవాడ, హైదరాబాద్లల్లో ఏకకాలంలో..
విజయవాడలోని బెంజ్ సర్కిల్లో కేంద్రంగా కొనసాగుతున్న నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలపై క్యాంపస్లకు చేరుకున్న ఆదాయపు పన్నుశాఖ అధికారులు నిరంతరాయంగా సోదాలను కొనసాగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా బ్రాంచీలను నిర్వహిస్తున్న శ్రీ చైతన్య, నారాయణ కళాశాలను వెంటనే రద్దు చేయాల్సిందిగా తెలంగాణ హైకోర్టు కొద్దిరోజుల కిందటే ఆదేశించిన విషయం తెలిసిందే. అనుమతులు లేకుండా కొనసాగుతున్న 68 విద్యాసంస్థలను మూసేయాలంటూ హైకోర్టు ఆదేశించింది.
ఏపీలో కూడా అనుమతి లేకుండా..
ఈ ఆదేశాలు వెలువడిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఏపీలో ఈ రెండు యాజమాన్యాలకు చెందిన విద్యాసంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు కొనసాగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో కూడా అనుమతులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా బ్రాంచ్లను ఏర్పాటు చేసుకున్నారంటూ ఫిర్యాదులు అందడంతో ఐటీ అధికారులు దాడులు, సోదాలకు దిగారు. విజయవాడ, హైదరాబాద్లల్లో ఏకకాలంలో దాడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు విద్యాసంస్థల మధ్య నిబంధనలకు విరుద్ధంగా..
విజయవాడలోని తాడిగడప, ఈడ్పుగల్లు, బెంజ్ సర్కిల్ సమీపంలోని శ్రీ చైతన్య, నారాయణల క్యాంపస్ ల నుండి ఐటి అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల బ్రాంచ్ల మధ్య చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న ఆర్థిక లావాదేవీల్లో భారీగా అవకతవకలను ఐటి అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. ప్రత్యేకించి ఐటి రిటర్న్స్ విషయంలో ఉద్దేశపూర్వకంగా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇంటర్ పరీక్షలు ఆరంభమైన సమయంలో..
ఫలితంగా భారీగా పన్నులను ఎగవేశారంటూ ఫిర్యాదులు అందినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ప్రాథమిక ప్రాధమిక సమాచారాన్ని అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఆరంభమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు విద్యాసంస్థలపై ఏకకాలంలో దాడులు కొనసాగడం కలకలం రేపుతోంది. ఫీజులు చెల్లించని కొందరు విద్యార్థుల హాల్ టికెట్లను కూడా నిలిపివేశారని, ఫలితంగా ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటీ అధికారులు సోదాలను చేస్తున్నారనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి.