సిఎం రమేష్ నివాసం, కార్యాలయాలపై ఐటి దాడులు...ఏకకాలంలో 25 చోట్ల సోదాలు
కడప:టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఇంటిపై ఐటి దాడులు జరుగుతున్నాయి. ఒకేసారి 60 మంది ఐటి అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటున్నట్లు తెలిసింది.
పిఎసి సభ్యుడిగా సిఎం రమేష్ ఇటీవల ఎపిలో జరిగిన ఐటి దాడులపై సమాచారం ఇవ్వాలని కోరిన మూడు రోజుల వ్యవధిలోనే ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా సిఎం రమేష్ నివాసంపై ఐటి దాడులు జరుగుతాయని..గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. మొన్న టిడిపికే చెందిన ఎంపి 'సుజనాచౌదరి' ఆస్తులపై దాడి చేసిన ఐటి అధికారులు..ఇప్పుడు తాజాగా మరో రాజ్యసభ ఎంపి 'సిపం రమేష్' ఇంటిపై దాడులకు దిగారు.
సిఎం రమేష్ నివాసంపై...ఐటి దాడులు
కడప జిల్లా పోట్లదుర్తిలోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్ , పలు కార్యాలయాల్లోనూ ఐటి బృందాలు తనిఖీలు జరుపుతున్నట్లు తెలిసింది. శుక్రవారం తెల్లవారుఝామునుంచే దాడులు ఆరంభించినట్లు తెలిసింది. సుమారు 60 మంది ఐటి అధికారులు సుమారు 25 చోట్ల దాడులు జరిపి సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
ఏకకాలంలో...అనేక చోట్ల దాడులు
హైదరాబాద్, కడపలో సిఎం రమేష్ కు సంబంధించిన ఉన్న ప్రతి ఒక్క నివాసం, కార్యాలయం లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో 8 చోట్ల, కడపలో 2 చోట్ల ఐటి అధికారులు సోదాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. సిఎం రమేష్ కాంట్రాక్టర్ గా వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్న క్రమంలో ఇప్పటికే వాటి వివరాలు సేకరించిన ఐటి శాఖ ఆ తరువాతే ఈ విధమైన దాడులకు దిగినట్లు టిడిపి నేతలు చెబుతున్నారు.
ఢిల్లీలో...సిఎం రమేష్
మరోవైపు సిఎం రమేష్ కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేపట్టి 100 రోజులు అయిన సందర్భంగా ఈ ప్రాజెక్టు విషయమై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్లారని, అక్కడ సంబంధిత శాఖా ముఖ్యులను కలిసేపనిలో బిజీగా ఉండగా...ఇక్కడ ఈ విధమైన దాడులు జరుపుతున్నట్లు టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
సిఎం రమేష్...స్పందన
ఈ దాడులపై స్పందించిన సిఎం రమేష్ ఈ దాడులు ఊహించినవేనని, తమపై కక్షకట్టిన కేంద్రం ఎన్నికలకు ముందు ఇలా దాడులకు దిగినట్లు చెప్పారు. భయానక వాతావరణ: సృష్టించేందుకే ఈ దాడులని, అయితే భయపడేది లేదని సిఎం రమేష్ స్పష్టం చేశారు.