ఇది రౌడీ, పోలీసుల రాజ్యం..మహిళల పాస్ పోర్టులు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు: కేశినేని నానీ
ఏపీలో రాజధాని కోసం అమరావతి రైతులు పోరాటం చేస్తున్నా జన కు కనిపించటం లేదని టీడీపీ ఎంపీ కేశినేని నానీ మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీల , పోలీసుల రాజ్యం నడుస్తోందని టీడీపీ నేత, ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . అమరావతి కోసం రోడ్డెక్కిన మహిళలను బెదిరిస్తున్నారని మండిపడిన ఆయన 470 మంది మహిళల పాస్పోర్టులు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ అదే చేస్తే చూస్తూ ఊరుకోమని మా సత్తా చూపిస్తామని కేశినేని నానీ పేర్కొన్నారు.
సీఎం మూర్ఖుడు, మొండివాడు అన్న కేశినేని నానీ
జాతీయ మహిళా కమిషన్ను కూడా పోలీసులు తప్పుదోవ పట్టించారని నానీ ఆగ్రహం వ్యక్తం చేశారు .ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ల ముందు ఎప్పుడూ సొంత పత్రికే ఉంటుందని అందుకే రాజధాని ప్రజల పోరాటం ఆయనకు కనపడటం లేదని కేశినేని నాని దుయ్యబట్టారు. జగన్ రాజకీయలబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. సీఎం మూర్ఖుడు, మొండివాడు అని నానీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయం ఇలా ఉన్నా పట్టింపు లేదని ఆయన పేర్కొన్నారు. జగన్ తెలివితేటలు దొంగ పనులకు వాడుతుంటారని కేశినేని నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇంత అరాచకం ఎక్కడా లేదన్న నానీ
పోలీసుల స్నేహపూర్వక విధానం ఇదేనా అని ప్రశ్నించారు. పోలీసులు శాంతియుత ర్యాలీలకు అనుమతి ఇవ్వకుండా వైసీపీ ర్యాలీలకు అనుమతి ఇవ్వటం దేనికని ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఎక్కడా లేదన్న కేశినేని నానీ ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుందన్నారు. అసలు ఎందుకు 144సెక్షన్ పెట్టారో .. ఆ అధికారం వీరికి ఎవరిచ్చారో కూడా అర్ధం కావటం లేదన్నారు.
ప్రజా రాజధానిని పోలీసుల రాజధానిగా మార్చారని ఫైర్
రాష్ట్రానికి వచ్చిన మహిళా కమీషన్ ప్రజలను కలవకుండా పోలీసులతో గంటలపాటు చర్చలు జరపటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలా మహిళలను ఇబ్బందులకు గురి చెయ్యటం కాశ్మీర్ లో కూడా చూసి ఉండమని ఆయన పేర్కొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇక్కడ రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటున్నారని కేశినేని నానీ మండిపడ్డారు. ప్రజా రాజధానిని పోలీసుల రాజధానిగా మార్చారని టీడీపీ ఎంపీ కేశినేని నానీ ఫైర్ అయ్యారు.