చంద్రబాబు రాజకీయ అధ్యాయం ముగిసినట్టేనా... జాతీయ పత్రిక సంచలన కథనం
Recommended Video
ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అధ్యాయం ముగియనుందా...? సొంత తప్పిదాలే ఆయన్ను అధికారంలోకి దూరం చేయనున్నాయా...? నాడు 2004లో చేసిన తప్పిదంతో అధికారానికి దూరమైన బాబు.. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితిని ఈ ఎన్నికల తర్వాత ఎదుర్కోనున్నారా..? ఇంతకీ జాతీయ మీడియా చంద్రబాబు గురించి చెబుతున్నదేమిటి...? ఈ ఐదేళ్లలో ఆయన ఫెయిల్యూర్స్ ఏమిటి...? బాబు పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని ఎందుకు తన కథనంలో రాసుకొచ్చింది..?
టీడీపీ-జనసేనల మధ్య రహస్య ఒప్పందం ఉందనే భావన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విమర్శ ప్రతివిమర్శలతో పార్టీలు చెలరేగిపోతున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీపై విమర్శలు గుప్పిస్తుంటే మరో కొత్త పార్టీ జనసేన కూడా ప్రతిపక్షంపై నిప్పులు చెరుగుతోంది. ఇటు అధికార టీడీపీ, తొలిసారిగా బరిలో నిలవనున్న జనసేన పార్టీలు రెండూ కలిసి ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు సంధిస్తుండటంతో ప్రజలు ఈ రెండు పార్టీల మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరిందనే భావనకు వచ్చేశారు. దీంతో ఇటు అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీకి కింగ్ మేకర్ అవుదామనుకుంటున్న జనసేన పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవనే సంకేతాలు వస్తున్నట్లు ప్రముఖ జాతీయ పత్రిక ఓ కథనం రాసుకొచ్చింది. ఇక చంద్రబాబు తను చేసిన తప్పిదాలు వల్లే ఈ సారి అధికారం కోల్పోయే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనంలో పేర్కొంది.
చంద్రబాబు తప్పిదాలే తనకు శాపమా..?
2004లో ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు వెళ్లారు. అంతకుముందు తాను అలిపిరిలో ఎదుర్కొన్న ప్రమాదంతో ప్రజల్లో సానుభూతి పెరిగిందని భావించి నాడు వాజ్పేయిని కన్విన్స్ చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్నారని కథనంలో పేర్కొంది. అప్పటికే వైయస్ఆర్ చేపట్టిన పాదయాత్రతో ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలిచారని ఇప్పుడు కూడా వైయస్సార్ తనయుడు జగన్ పాదయాత్రతో మెజార్టీ ప్రజలు ఆయన పక్షాన నిలుస్తున్నారని కథనం పేర్కొంది. 2014లో మోడీతో జతకట్టడం ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడంతో స్వల్ప మెజార్టీతో చంద్రబాబు గట్టెక్కినట్లు కథనంలో పేర్కొంది.
బైబై బాబు...బైబై పప్పూ: ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న షర్మిల
ప్రత్యేక హోదా పై యూటర్న్ తీసుకోవడంతో మరింత చులకన భావం
ఇక ఎన్డీఏతో దాదాపు నాలుగేళ్లు కలిసి ప్రయాణం సాగించిన తర్వాత ప్రత్యేక హోదా టర్న్ తీసుకోవడం మరో తప్పిదమని కథనం వెల్లడించింది. హోదాతో ఏమొస్తుందని ప్రత్యేక ప్యాకేజీనే బాగుందంటూ చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత యూటర్న్ తీసుకోవడంతో ప్రజల్లో క్రెడిబులిటీ కోల్పోయినట్లు జాతీయ పత్రిక పేర్కొంది. చంద్రబాబు నోట ప్రత్యేక హోదా వచ్చిందంటే అది ప్రతిపక్షనేత జగన్ వల్లే అని జాతీయ పత్రిక వెల్లడించింది.
ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఎప్పుడు ఒంటరిగా పోటీచేయలేదని గుర్తుచేసింది జాతీయ పత్రిక కథనం. 2004లో ఒంటరిగా బరిలోకి దిగి నామరూపాలు లేకుండా పోయారని వెల్లడించింది. ఇక 1999లో బీజేపీతో, 2014లో బీజేపీ జనసేనలతో కలసి పోటీ చేసి విజయం సాధించారు చంద్రబాబు. 2009లో ప్రజారాజ్యం వచ్చి ఎలాగైతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి మళ్లీ వైయస్ అధికారంలోకి రావడం సహకరించిందో అదే ఈసారి కూడా జరిగే అవకాశం ఉందన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. జనసేన పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సహకరిస్తుందనే కాన్ఫిడెన్స్తో బాబు ఉన్నట్లు ఆ కథనం పేర్కొంది. అంతేకాదు మోడీపై ఉన్న వ్యతిరేకత కూడా తనకు సహకరిస్తుందని బాబు భావిస్తున్నట్లు కథనం పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న భావనలో ప్రజలు
ఇక చంద్రబాబు చేస్తున్న మరో తప్పిదాన్ని కూడా జాతీయ మీడియా తన కథనంలో రాసుకొచ్చింది. జగన్కు కేసీఆర్ సహకరిస్తున్నారని, బీజేపీ అండగా ఉందని ప్రజల్లో పదే పదే చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం బాబు మాటలను విశ్వసించడం లేదని వెల్లడించింది. అంతేకాదు కేసీఆర్ ఆంధ్రుల వ్యతిరేకి అని తన ప్రచారంలో చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండటం చంద్రబాబుకు బాగా మైనస్ అవుతోందని జాతీయ పత్రికి అభిప్రాయపడింది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేసీఆర్ పై ఎలాంటి కోపమూ లేదా ద్వేషం లేదని కథనంలో పేర్కొంది.అంతేకాదు తెలంగాణలో కొన్ని వేలమంది ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజలు జీవిస్తున్నారని ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారని కేసీఆర్ను తమ నాయకుడిగా ఒప్పుకున్నారని కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తిరిగి విద్వేషాలు రెచ్చగొట్టడం ఎంతమాత్రం ప్రజలు ఆమోదించడం లేదని వెల్లడించింది. పుల్వామాలాంటి దాడుల తర్వాత మోడీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్తో ప్రజలు మోడీకి సానుకూలంగా ఉన్నారు. ఇక రాష్ట్ర విషయానికొస్తే జగన్ను గెలిపించడం ద్వారా మోడీతో ఒక అవగాహనకు వచ్చి తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత కుదిరేలా ప్రయత్నాలు చేస్తారని ప్రజల ఆలోచనగా ఉన్నట్లు కథనం పేర్కొంది.
కాంగ్రెస్తో జతకట్టడాన్ని అవకాశ రాజకీయంగా పరిగణిస్తున్న ప్రజలు
ఇక అన్నిటికంటే చంద్రబాబు తన రాజకీయ జీవితంలోనే చేసిన అతిపెద్ద తప్పిదం కాంగ్రెస్తో జతకట్టడం. దీన్ని ప్రజలు ఎంతమాత్రం జీర్ణించుకోలేకున్నారని కథనం పేర్కొంది. కేసీఆర్ను తెలంగాణలో ఓడించేందుకు కాంగ్రెస్తో జతకట్టారు చంద్రబాబు. మోడీని గద్దె దించేందుకుగాను మహాకూటమి ఏర్పాటులోను కీలకంగా వ్యవహరిస్తున్నారనే భావన కలిగిస్తున్నారని కథనం ప్రచురించింది. రాహుల్ గాంధీతో చెట్టాపట్టాల్ వేసుకుని చంద్రబాబు తెలంగాణలో తిరగడంతో కేసీఆర్ అనుకున్నదానికంటే భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్తో కలిసి పోటీ చేయనప్పటికీ ప్రజలు మాత్రం ఇందులోని రహస్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని కథనం పేర్కొంది.
మొత్తానికి మే 23న చంద్రబాబుకు రిటైర్మెంట్ పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ఇందుకు ఏప్రిల్ 11 వేదిక కానుందని జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది.