ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు యువకుడికి ఫైన్...డబ్బు కోసం వీరంగం:ఆత్మహత్య
అనంతపురం:ప్రేమ పెళ్లి ఆ యువకుడి చావుకు కారణమైంది. ఇష్టపడి ప్రేమికురాలి మెడలో పసుపు తాడు కట్టినందుకు మనువాడిన అతడు ఉరితాడుకు బలయ్యాడు. పైకి ఇది ఆత్మహత్య అయినప్పటికి నిజానికిదో పరువు హత్య...ప్రేమించిన అమ్మాయినే కట్టుకున్న అతడి నిజాయితీ దీన్ని కేవలం కులాంతర వివాహంగానే చూసిన అమ్మాయి తరుపు పెద్దలకు కనిపించలేదు...అందుకే బలవంతంగా అమ్మాయి మెడలో తాళి తెంచేసి ఇద్దరినీ వేరు చేసిపారేశారు.
అంతేకాదు పరువు పోగొట్టినందుకు అమ్మాయి కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ అమ్మాయిని పెళ్లాడిన యువకుడికి ఫైన్ వేశారు. దానికి టైమ్ కూడా ఫిక్స్ చేశారు. అయితే గడువు లోపల యువకుడు ఆ మొత్తం చెల్లించలేక పోవడంతో అమ్మాయి బంధువొకరు రంగంలోకి దిగాడు. యువకుడిని తీవ్రంగా దుర్భాషలాడుతూ డబ్బు చెల్లిస్తావా...చస్తావా...లేక నేనే నిన్ను చంపేయనా...అసలు డబ్బుల్లేనోడికి పెళ్లెందుకంటూ అంటూ వీరంగం వేశాడు. దీంతో ఆ పేద యువకుడు అప్పటికప్పుడు డబ్బులు చెల్లించలేక అటు అవమానభారంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే...
మృతుని తండ్రి కథనం ప్రకారం...అనంతపురం జిల్లా కొర్రేవులో ఉప్పర రంగనాథ్ ఇంటికి కోడలి వరుసయ్యే యువతి నెలన్నర క్రితం చుట్టం చూపుగా వచ్చింది. ఈమెది గుడిబండ మండలంలోని ఓ గ్రామం అని తెలిసింది. ఈ ఇంటి సమీపంలోనే ఉంటున్న సన్న హనుమంతగౌడ (22) అనే యువకుడికి ఈ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. దీంతో కులాలు వేరైన వీరు తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరనే భావనతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు కాపురం పెట్టే నిమిత్తం యువకుడి స్వగ్రామానికి తిరిగివచ్చారు.
అయితే ఈ పెళ్లిని పెళ్లి కూతురు మామ రంగనాథ్ అంగీకరించలేదు. తన బంధువైన యువతిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లిపోయి ఆమె మెడలోని తాళిబొట్టును తెంపేశాడు. అనంతరం యువతిని ఆమె స్వస్థలానికి పంపించేశాడు. అంతటితో ఆగకుండా ఈ ప్రేమ పెళ్లిపై పెద్ద మనుషులు 'పంచాయితీ' పెట్టించాడు. వాళ్లు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందుకు రూ.1.4 లక్షలు రంగనాథకు యువకుడు సన్నహనుమంతగౌడ జరిమానా గా ఇవ్వాలని తీర్మానించారు. దానికి గడువు కూడా పెట్టారు. పెద్దలు ఇచ్చిన ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనుండటంతో మంగళవారం యువకుడి ఇంటివద్దకు వెళ్లిన యువతి మామ రంగనాథ్ జరిమానా డబ్బు చెల్లిస్తావా...లేదా అంటూ బెదిరింపులకు దిగాడు.
డబ్బు కోసం రంగనాథ్ బెదిరించడం, అవమానకరంగా మాట్లాడటంతో మనస్తాపం చెందిన సన్నహనుమంతగౌడ ఎవరికీ చెప్పకుండా తన ఇంటి వద్ద నుంచి బయలుదేరి పొలంలోనే మామిడి చెట్టుకు ఉరివేసున్నాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన యువకుడి తండ్రి తన కుమారుడు మృతికి యువతి మామ రంగనాథ్, పెద్దమనుషులు గౌడ హనుమప్ప, నాగరాజు కారణమని సన్నహనుమంతగౌడ తండ్రి బాలక్రిష్ణ ఎస్ఐ దిలీప్కుమార్కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారి మీద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.