ఐటీ అధికారులకు మీడియా బెడద...వదలకుండా వెంటాడుతుండటంతో రూటు మార్చారట!
విజయవాడ:ఎపిలో ఐటి దాడులు చేస్తున్న ఇన్ కంటాక్స్ బృందాలకు మీడియా వర్గాల నుంచి ఊహించని సమస్య ఎదురైంది. దీంతో వారు తమ దాడుల రూట్ మ్యాప్ నే ఛేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైనట్లు తెలిసింది. అసలేం జరిగిందంటే...
విజయవాడ,గుంటూరుల్లో దాడుల కోసమని గురువారం రాత్రికే విజయవాడకు తరలివచ్చిన ఇన్ కంటాక్స్ అధికారులకు కొంత సేపట్లోనే షాక్ తగిలింది. తమ రాకకు సంబంధించి కొన్ని టీవీ ఛానెళ్లలో బ్రేకింగ్ న్యూస్ లు రావడంతో విస్తుపోయారట. ఈ నేపథ్యంలోనే దాడులకు రూట్ మ్యాప్ సిద్దం చేసుకొని బయలు దేరిన ఐటి బృందాలను మీడియా ప్రతినిధులు వెంబడిస్తుండటంతో ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో ఆ దాడుల తీరుతెన్నులను కూడా మార్చుకున్నారట.
శుక్రవారం ఉదయాన్నే దాడులకు బయలుదేరిన ఐటి బృందాలను వారు ఎటు వెళితే అటు మీడియా ప్రతినిథులు వెంబడిస్తుండటంతో గత్యంతరం లేక ప్లాన్ బీని అమలు చేసినట్లు తెలుస్తోంది. తొలుత బెంజిసర్కిల్లోని నారాయణ కాలేజికి వెళ్లిన ఐటీ బృందం తమనే అనుసరించి మీడియా ప్రతినిథులు అక్కడకు రావడంతో అక్కడి నుంచి బందర్ రోడ్డులోకి వెళ్లారు.
అక్కడకు కూడా వారిని మీడియా ప్రతినిథులు అనురిస్తూ రావడంతో అక్కడ మీడియా ప్రతినిథులతో ఐటి అధికారులు మాట్లాడి...తమ పని తమని చేసుకోనివ్వాలని ఇలా వెంబడించవద్దని...మధ్యాహ్నం తర్వాత తామే మీడియాకు దాడుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారట. అయితే సరేనన్న మీడియా ప్రతినిథులు వీరి దాడులపై దృష్టి కేంద్రీకరించి ఉంచిన పరిస్థితుల్లో ప్లాన్ బి అమలు చేశారని సమాచారం.
ఇక మంత్రి నారాయణ కాలేజ్, కార్యాలయాలపై దాడులు జరిగియంటూ మీడియాలో వెలువడిన వార్తలు సంచలనం సృష్టించాయి. అయితే ఈ విషయమై మంత్రి నారాయణ మాట్లాడుతూ తమ కళాశాలలపై ఎటువంటి ఐటీ దాడులు జరగలేదని ప్రకటించారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని నారాయణ విద్యాసంస్థలపై ఎక్కడా కూడా ఐటీ అధికారులు దాడులు చేయలేదని ఆయన వివరించడం గమనార్హం.