మరి పవన్,వైసిపి నేతలపై ఐటీ దాడులు చేయరేం?:టిడిపి నేత ముష్టి శ్రీనివాస్
విజయవాడ:జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్, వైసీపీ నేతలపై ఐటీ అధికారులు దాడులు జరపకుండా కేవలం టీడీపీ నాయకులు, సానుభూతిపరులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని టిడిపి నేత ముష్టి శ్రీనివాస్ ప్రశ్నించారు.
విజయవాడలోని టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం టీడీపీనే లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తోందని ముష్టి శ్రీనివాస్ విమర్శించారు. తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఐటీ శాఖను అడ్డంపెట్టుకుని కపట నాటకం ఆడుతోందని ఆయన దుయ్యబట్టారు. బాబ్లీ కేసును కూడా ఈ విధమూన కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇటీవల మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు.
మరోవైపు
బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు మరోసారి టిడిపి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏటూరులో బిజెపి పార్టీ నిర్వహించిన ప్రజా ఆవేదన ధర్నాలో ఎంపి జీవిఎల్ పాల్గొన్నారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి నాయకులు కలిసి అవినీతిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిపారని జీవిఎల్ నరసింహారావు దుయ్యబట్టారు.
వారి బండారం ఎక్కడ బైటపడుతుందో అని ఐటీ సోదాలపై గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. గుమ్మడి కాయల దొంగల మాదిరిగా పన్ను ఎగవేతదారులపై ఐటీ దాడులు జరుగుతుంటే తెలుగు దొంగలు ఉలిక్కి పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి అనే కంటే ముఖ్య'కంత్రి' అనడమే సమంజసంగా ఉంటుందని జివిఎల్ అభివర్ణించారు.
పన్ను ఎగవేతదారులపై ఐటీ దాడులు జరిగితే సిఎం చంద్రబాబు ఆఘమేఘాల మీద కేబినెట్ మీటింగ్ నిర్వహించడం సిగ్గుచేటని ఎంపి జీవిఎల్ ధ్వజమెత్తారు. ఇది కేబినెట్ మీటింగ్ లా కాకుండా మాఫియా సమావేశంలా సాగిందన్నారు. తెలుగుదేశం పార్టీ కాస్త మాపియా పార్టీ మారిపోయిందని జివిఎల్ మండిపడ్డారు. దోపిడీదారులకు ఎపి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని జివిఎల్ విమర్శించారు.