అది మంచి పరిణామం... తప్పుగా భావించాల్సిన పనిలేదు... ఆ విషయంలో పోలీసులకు సీఎం జగన్ సూచన...
రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో ఎక్కువ ఎఫ్ఐఆర్లు నమోదు కావడం మంచిదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయనే సంశయం పోలీసులకు అక్కర్లేదని... దాన్ని తప్పుగా భావించాల్సిన పని లేదని అన్నారు.పోలీస్ స్టేషన్లకు ఎక్కువ ఫిర్యాదులు రావడం... వాటిపై కేసులు నమోదవడం మంచి పరిణామమని పేర్కొన్నారు.స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో సీఎం జగన్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో దిశ యాప్ ద్వారా ఫిర్యాదుల నమోదుకు అవకాశం కల్పిస్తున్నామని... ఆ దిశగా మహిళలను ప్రోత్సహిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. కాబట్టి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని... ఎవరైనా వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.ఎక్కువ కేసులు నమోదవుతున్నాయంటే... పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లేనని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు రావడం మంచి పరిణామం అని అభిప్రాయపడ్డారు.
కేరళ రాష్ట్రంలో ఏడాదికి 7లక్షలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయని జగన్ పేర్కొన్నారు.కాబట్టి ఎక్కువ కేసులు నమోదైతే రాష్ట్రానికి చెడు పేరు వస్తుందనే భావన సరికాదన్నారు. మహిళల్లో చైతన్యం పెరిగినప్పుడు,పోలీసులు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే ఫిర్యాదుదారులు స్వేచ్చగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తారని తెలిపారు.
జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు క్రమం తప్పకుండా గ్రామ సచివాలయాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు సీఎం జగన్. డిసెంబర్ నుంచి తాను కూడా గ్రామ సచివాలయలను సందర్శిస్తానని తెలిపారు. ప్రతి నెల చివరి శుక్ర, శని వారాల్లో సిటిజన్ అవుట్రీచ్ కార్యక్రమం చేపడతామని అన్నారు.గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమని సీఎం జగన్ తెలిపారు. ఈ విషయంలో అలసత్వం వహించే వారిపై చర్యలకు ఏ మాత్రం వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. కలెక్టర్లు ప్రతి వారం 2 సచివాలయాలు, జాయింట్ కలెక్టర్లు వారానికి 4 సచివాలయాలు సందర్శించాలని ఆదేశించారు.ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగు గ్రామ సచివాలయాలు సందర్శించాలన్నారు.అధికారులు,ప్రజాప్రతినిధులు వెళ్లకపోతే, సచివాలయ వ్యవస్థ ఎలా పర్యవేక్షించకపోతే పరిపాలన మెరుగుపడదని అన్నారు.
రాబోయే విజయదశమి రోజున 'ఆసరా పథకం' అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అక్టోబరు 7 నుంచి 10 రోజలుపాటు 'ఆసరా పథకం'పై అవగాహన, చైతన్య కార్యక్రమాలు ఉంటాయన్నారు. అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సహా ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇందులో పాలుపంచుకోవాలని సూచించారు.మండలం ఒక యూనిట్గా ఈ కార్యక్రమాలు జరుగుతాయని సీఎం చెప్పారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద రూ.6500 కోట్లు ఇస్తున్నామని.. దాదాపు 80లక్షల మందికిపైగా మహిళలు లబ్ధిపొందుతున్నారని వెల్లడించారు.