చంద్ర నిప్పులు: అవినీతి పార్టీతో అంటకాగుతూ నాపై విమర్శలా... మోడీపై చంద్రబాబు ఫైర్
Recommended Video
ఢిల్లీ: ఏపీకి ఎన్డీఏ చేసిన అన్యాయంపై దేశానికి చెప్పేందుకే అమరావతి నుంచి ఢిల్లీకి వచ్చినట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా అవిశ్వాస తీర్మానం పెట్టినసమయంలో మద్దతు ఇచ్చిన పార్టీలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మోడీ ప్రభుత్వానికి అంత మెజార్టీ వచ్చిందంటే తమ భాగస్వామ్యం కూడా ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పలుమార్లు మోడీ హామీ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. తిరుపతిలో వెంకటేశ్వరస్వామి ముందు హామీ ఇచ్చి మాటతప్పారని ధ్వజమెత్తారు. ఆ తర్వాత నెల్లూరులో కూడా ఇదే తరహా హామీ ఇచ్చారు. అనంతరం అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో కూడా కొంత ఎమోషనల్గా మోడీ మాట్లాడారని చంద్రబాబు చెప్పారు. ఢిల్లీకి మించిన రాజధానిని కడతామని హామీ ఇచ్చారని చెప్పారు.
కాంగ్రెస్ రాష్ట్రం విడగొట్టిందన్నారు..మరి బీజేపీ చేసిందేమిటి..?
ఆనాటి ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ, ప్రతిపక్షనేతగా ఉన్న తను ఇద్దరం ప్రచారం చేసి అధికారంలోకి రావడం జరిగిందని చంద్రబాబు చెప్పారు. అనంతరం రెండు మంత్రి పదవులు టీడీపీకి ఇచ్చారు. అయితే కేబినెట్లో చేరాలన్న అత్యాశ తమకు లేదని... కానీ ఏపీకి అన్యాయం జరిగినందున న్యాయం కోసం మాత్రమే ఇద్దరని కేబినెట్లోకి చేర్చడం జరిగిందన్నారు. ఏపీకి న్యాయం చేసేందుకు తాను 29 సార్లు ఢిల్లీకి వచ్చినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. కాంగ్రెస్ను మీరు తప్పుబడుతున్నారు... మరి బీజేపీ చేసిందేమిటని బాబు సూటిగా ప్రశ్నించారు. ముందుగా స్పెషల్ స్టేటస్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని... ఆ తర్వాత ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడంలేదని చెప్పారని..దీని స్థానంలో స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని ఒప్పించారని చెప్పారు. అయితే 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన రిపోర్ట్ను సాకుగా చూపించి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పడం విడ్డూరమని మండిపడ్డారు. 14వ ఫైనాన్స్ కమిషన్లో సభ్యులుగా ఉన్న గోవిందరావు చేసిన స్టేట్మెంట్ను చంద్రబాబు చదివి వినిపించారు.
మోడీతో అర్థరాత్రి ఫోన్ చేశానని అయితే సమయం మించిపోయినందున మోడీ ఫోన్లో మాట్లాడలేకపోయానని చెప్పారు. మరుసటి రోజు మోడీ తనకు ఫోన్ చేస్తే... రాష్ట్రానికి జరిగిన అన్యాయం దృష్ట్యా ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు. టీడీపీని ముఖ్యంగా తన నాయకత్వంలో ఉన్న టీడీపీని జగన్ పార్టీతో పోల్చడం చాలా బాధేసిందని చెప్పారు. ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూ తిరిగే వ్యక్తితో తనను పోల్చడం మోడీకి తగదని చెప్పారు. కళంకిత వ్యక్తులతో మీరు అంటకాగుతూ మా నిజాయితీని ప్రశ్నిస్తారా అని చంద్రబాబు ధ్వజమెత్తారు.ఈశాన్య భారతదేశానికి ఇస్తున్న బెనిఫిట్స్ ఏపీకి ఎందుకు ఇవ్వడంలేదనేదే తాము ప్రశ్నిస్తున్నట్లు బాబు చెప్పారు.
హైదరాబాద్ సృష్టించింది నేనే..భాగ్యనరగం నా మానసపుత్రిక
హైదరాబాద్ తానే సృష్టించినట్లు చెప్పుకొచ్చిన చంద్రబాబు తన కష్టంతోనే ఈరోజు హైదరాబాద్ అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోందన్నారు. హైదరాబాద్ తన మానసపుత్రిక అని బాబు చెప్పారు. బిల్ గేట్స్ హైదరాబాద్కు వచ్చినప్పుడు 10 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని.. ఆ తర్వాత భాగ్యనగరం గురించి వివరిస్తుండగా ఏకంగా 40 నిమిషాల పాటు ఓపికగా విన్నారని చెప్పారు. అంతేకాదు సియాటెల్ నుంచి మరొక బ్రాంచ్ ఏర్పాటు చేయాలంటే తను ముందుగా హైదరాబాద్నే పరిశీలిస్తానని ఆనాడు బిల్ గేట్స్ చెప్పారని చంద్రబాబు వెల్లడించారు.
మోడీనే యూటర్న్ తీసుకున్నారు
మోడీ కంటే ముందుగా తనే ముఖ్యమంత్రి అయ్యానని చెప్పిన చంద్రబాబు... కేసీఆర్పై పొగడ్తల వర్షం కురిపించి తనపై విమర్శలు గుప్పించడం వల్ల ప్రధాని ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని బాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని ఇద్దరి ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పటికీ ఇద్దరు ముఖ్యమంత్రులం చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుంటున్నామని చెప్పారు. యూటర్న్ తీసుకున్నది తాను కాదని మోడీ యూటర్న్ తీసుకున్నారని బాబు మండిపడ్డారు.శుక్రవారం వైసీపీ కోర్టులో ఉంటే... టీడీపీ ఎంపీలు పార్లమెంటులో పోరాడారని చంద్రబాబు గుర్తుచేశారు. అలాంటి పార్టీని మోడీ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు.
అరకొర నిధులతో ప్రాజెక్టులు విద్యాసంస్థలు ఎప్పుడు పూర్తవుతాయి
ఏపీకి జీవనాధారంగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంకా డబ్బులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. లోటు భర్తీకి ఇచ్చిన డబ్బులు రైతు రుణమాఫీల కోసం, పెన్షన్లు ఇవ్వడం కోసం వినియోగించినందునే నిధులు ఇవ్వలేమని కేంద్రం చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇచ్చి ఎలా ఖర్చుచేశారో... యూసీలు ఇవ్వాల్సిందిగా కోరుతోందని వారు చెప్పినట్లుగానే యూసీలు ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ యూసీలు ఇవ్వలేదని ఆరోపించడం తగదని బాబు చెప్పారు. ఇప్పటికీ రాష్ట్రం ప్రభుత్వం పెట్టిన ఖర్చులను కేంద్రం తిరిగి చెల్లించలేదని చెప్పారు. బుందేల్ ఖండ్కు అంత పెద్ద మొత్తంలో ప్యాకేజీ ఇచ్చి వెనకబడిన జిల్లాల అభివృద్దికి ముష్టి వేసినట్లు వేశారని బాబు మండిపడ్డారు. రాజధానికోసం ఇచ్చిన రూ.1500 కోట్లతో కనీసం కేబుల్ వర్క్కూడా చేయలేమని సీఎం అన్నారు.
ఇక విద్యాసంస్థలకు విషయానికొస్తే అప్పుడు సెంట్రల్ యూనివర్శిటీలు స్థాపిస్తామని చెప్పి... ఇప్పుడు రాష్ట్రస్థాయికే వాటిని పరిమితం చేయడం అన్యాయమన్నారు. విద్యాసంస్థలకు కేటాయిస్తున్న నిధులను చూస్తే విద్యాసంస్థలు పూర్తి అవడానికి మరో 40 ఏళ్లు పడుతాయని సీఎం విమర్శించారు. అహ్మదాబాద్ నుంచి ముంబై మెట్రోకు మాత్రం నిధులు కేటాయిస్తున్నారు.. అదే ఏపీ విషయానికొస్తే మాత్రం వెనుకడుగు వేస్తున్నారని సీఎం దుయ్యబట్టారు.
అసెంబ్లీ సీట్లు పెంచితే బలహీనపడుతామన్నది బీజేపీ ఆలోచన
అసెంబ్లీ సీట్లు పెంచాలని అడిగామని చెప్పిన చంద్రబాబు అక్కడ టీడీపీ బలపడి బీజేపీ బలహీనపడుతుందని అసెంబ్లీ సీట్లు పెంచలేదని చెప్పారు. అయినా ప్రజలు తమవైపు ఉన్నారని సీఎం ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీలో ఏటీఎంలో పనిచేయడం లేదని విమర్శించారు. అంతేకాదు మరోవైపు కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని... ఖాతాలో ఉన్న మన డబ్బులను ఈక్వీటీలల్లో పెట్టేందుకు చట్టం తయారు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
నిన్న పార్లమెంటులో టీడీపీ ఎంపీలు పోరాడారని అందుకు వారిని అభినందిస్తున్నట్లు చెప్పారు. తమకు మద్దతు ఇచ్చిన పార్టీలకన్నిటికీ ధన్యవాదాలు చెప్పారు. కాంగ్రెస్ను వారు మద్దతు అడగలేదని అయినప్పటికీ ఆ పార్టీ సపోర్ట్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. కీలక సమయంలో తమకు అండగా నిలిచిన పార్టీలకు ఏపీ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఇక చివరిగా కేంద్రం ఇచ్చిన హామీలను అమలు పరచాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇప్పుడు గాయాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్కు చికిత్సనందించి గట్టెక్కించాలని కోరారు. కుటుంబ పెద్దగా రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. ఐదుకోట్ల ఆంధ్రుల ఆక్రందనను విని చట్టంలో పొందుపర్చిన అంశాలను వెంటనే చేయాలని చెప్పారు. ఏపీకి న్యాయం జరిగేవరకు తమ పోరాటం ఆగదని తెలిపారు.