సీఎం జగన్కు ఇది ఆత్మహత్య: నాశనం చేస్తున్నారు: మరోసారి పాయ్ తీవ్ర వ్యాఖ్యలు ..!
టీవీ మోహన్దాస్ పాయ్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాల పైన తొలి నుండి తీవ్రంగా విమర్శిస్తున్న వ్యక్తి. కర్ణాటకకు చెందిన ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, అక్షయ పాత్ర సంస్థ సహవ్యవస్థాపకుడు. ఇప్పుడు సింగపూర్ కంపెనీలు అమరావతి స్టార్టప్ ఒప్పందం నుండి ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా విత్ డ్రా అవుతున్నట్లు ప్రకటించాయి. దీని పైన పాయ స్పందించారు. ఇది ఏపీకి చెడు వార్తగా అభివర్ణించారు. అదే సమయంలో ఇది ముఖ్యమంత్రి జగన్ కు హరాకిరీ (ఆత్మహత్య) అంటూ ట్వీట్ చేసారు.
జగన్ ఏపీపైన పెట్టుబడి సంస్థల నమ్మకాన్ని నాశనం చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ పరిస్థితుల్లో ఏ పెట్టుబడి దారుడైనా ఏపీలో ఎందుకు పెట్టుబడి పెడతారని ప్రశ్నించారు. ఇప్పుడు ఏపీలోని ప్రతిపక్షాలతో పాటుగా పాయ్ చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో..గతంలోనూ ఇదే రకంగా సీఎం జగన్ పైన పాయ్ ఎటువంటి వ్యాఖ్యలు చేసారనేది ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
సీఎం జగన్కు హరాకిరీయే...పాయ్ ట్వీట్
సింగపూర్ కంపెనీలు అమరావతి నుంచి తిరుగుముఖం పట్టడం ఆంధ్రప్రదేశ్కు బ్యాడ్ న్యూస్ అంటూ టీవీ మోహన్దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. అమరావతిలో స్టార్టప్ ఏరియా మౌలిక వసతుల పనులను ఆంధ్ర ప్రభుత్వం రద్దు చేసింది. సింగపూర్ కంపెనీలు అమరావతి నుంచి వెళ్లిపోయిన అంశాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ తన అభిప్రాయాన్ని వివరించారు.
ఇది.. ఆ రాష్ట్రానికి ఇది బ్యాడ్ న్యూస్..... ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు హరాకిరీ (ఆత్మహత్య)... ఆయన ఒంటి చేత్తో ఆంధ్రప్రదేశ్పై పెట్టుబడి సంస్థల నమ్మకాన్ని నాశనం చేస్తున్నాంటూ ట్విటర్లో పేర్కొన్నారు. దీనివల్ల వచ్చే ఉద్యోగాలు పోతాయని.. అభివృద్ధి కుంటుపడుతుందని.. ఈ పరిస్థితుల్లో ఏ పెట్టుబడిదారైనా అక్కడ ఎందుకు పెట్టుబడి పెడతారని ప్రశ్నించారు. ఇది నిజంగా బాధాకరమని వ్యాఖ్యానించారు.
గతంలోనూ ఇదే రకంగా..విమర్శలు
గతంలో ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల సమీక్షకు నిర్ణయించారు. దీని పైన కేంద్ర మంత్రితో పాటుగా జపాన్ కు చెందిన సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాసాయి. సమీక్షలు వద్దంటూ కేంద్ర ఇంధన శాఖ సైతం సూచన చేసింది. అయితే ప్రస్తుతం ఏపీలో డిస్కింలు ఉన్న పరిస్థితుల్లో ధరల సమీక్ష తప్పు కాదంటూ ప్రభుత్వం వాదించింది.
ఏపీ నుంచి పెట్టుబడులు
ఏపీ నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లడంపై కూడా సీఎం జగన్ పైన పాయ్ తీవ్ర విమర్శలు చేసారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశం లేకుండా.. ఏపీని జగన్ నాశనం చేస్తున్నారంటూ అప్పట్లో ట్వీట్ చేసారు. దీనికి ఆ సమయంలో విదేశాల్లో ముఖ్యమంత్రితో పాటు ఉన్న సీనియస్ ఐఏయస్ పీవీ రమేష్ ఘాటుగా బదులిచ్చారు. ఏ మంత్రి స్పందంచకపోయినా.. ఆయన ప్రభుత్వం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశాన్ని వివరిస్తూ..పాయ్ తన వ్యాఖ్యలను నియంత్రించుకోవాలని సూచించారు.
ప్రతిపక్షాలు..ప్రభుత్వం ఇలా..
కాగా, అమరావతి నుంచి వైదొలగుతున్నట్లు సింగపూర్ విడుదల చేసిన ప్రకటనపై మాజీ సీఎం చంద్రబాబు ట్విటర్లో స్పందించారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోవడానికి సింగపూర్ మనతో కలిసి సంతకాలు చేసినప్పుడు ఒక నమ్మకం, ఆశ వెల్లివిరిశాయి. ఇప్పుడు వాళ్లు వెనక్కి వెళ్లిపోవడంతో కలలు కల్లలై ఆశలు కుప్పకూలాంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటోంది.
పాయ్ వ్యాఖ్యల నేపథ్యంలో
నిర్ణీత కాల వ్యవధి లోగా సింగపూర్ సంస్థలు ఏ మాత్రం ముందుకు వెళ్లలేదని..ఇది ఏపీకి నష్టం చేస్తుందనే నిపుణుల సలహా మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో..ఇప్పుడు ఏపీలో ఇసుక రాజకీయాలతో పాటుగా.. పాయ్ తాజాగా చేసిన విమర్శల చుట్టూ రాజకీయం తిరిగే అవకాశం కనిపిస్తోంది. పాయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.