పుండు ఒక చోట ఉంటే మందు ఒక చోట పూస్తున్నారు చంద్రబాబు: రాఘవులు
దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2019 ఎన్నికల సమయానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చే బాధ్యతను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన పలువురి జాతీయనేతలు ప్రాంతీయ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. అయితే చంద్రబాబు ఇలా అందరి నేతలను కలవడాన్ని కమ్యూనిస్టు నేత బీవీ రాఘవులు తప్పుబట్టారు.
బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగడుతున్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి మోడీ సర్కార్ పై 2019లో విజయం సాధించాలని తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పలువురు జాతీయ నేతలను ప్రాంతీయపార్టీ నేతలను కలుస్తున్నారు. నవంబర్ 1న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన చంద్రబాబు ప్రజాస్వామ్యం పరిరక్షించుకునేందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఏపార్టీతో అయిన కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. అంతకుముందు అఖిలేష్ యాదవ్, మాయావతిలను కలిసి చర్చించిన చంద్రబాబు తాజాగా దేవెగౌడ, స్టాలిన్లాంటి నేతలను కూడా కలిశారు. ఇంకా భవిష్యత్తులో చాలామంది నేతలను కలవాలని బాబు భావిస్తున్నారు.
చంద్రబాబు దమ్ముంటే బీజేపీలో ఉన్న పార్టీలను వేరు చేయాలి: రాఘవులు
ఇక చంద్రబాబు తీరును తప్పుబట్టారు కమ్యూనిస్ట్ నేత బీవీ రాఘవులు. పుండొక చోట తగిలితే అందుకు మందు మరో చోటు పూయడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను వెళ్లి కలవడం వల్ల చంద్రబాబుకు ఒరిగేది ఏమీ లేదని చెప్పారు. వీలైతే బీజేపీకి మద్దతుగా ఉన్న పార్టీలను కమలం పార్టీ నుంచి దూరం చేయాలని అలా చేస్తే ఏదైనా ఫలితాన్ని రాబట్టొచ్చు కానీ ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఆ పార్టీ అధినేతలను కలిస్తే లాభం ఏముంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు మెడకు ఉచ్చు బిగుస్తోందని అందుకే జాతీయ పార్టీల నేతలను చంద్రబాబు కలుస్తున్నారని రాఘవులు ధ్వజమెత్తారు.
మహాకూటమిలో సానుకూలం కన్నా ఇబ్బందులే ఎక్కువ
మహాకూటమిలో సానుకూలం కన్నా...ఇబ్బందులే ఎక్కువని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత మహాకూటమిగా ఏర్పడితే మంచిదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబును విమర్శిస్తున్న జగన్ మోడీ పట్ల ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నోట్ల రద్దులో మోడీతో పాటు చంద్రబాబుకు కూడా పాపం ఉందని ధ్వజమెత్తారు.