బెట్టింగ్ కాసేప్పుడు ఎంతో మజా..! ఓడిపోయి డబ్బులు కట్టాల్సొచ్చినప్పుడు మాత్రం బ్యాండ్ బాజా..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో ఎన్నికల ఘట్టం ముగిసింది. ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ ఓడిపోతుంది అనే అంశం పై పందేలు కాసిన వాళ్లు ఇప్పుడు వాసూళ్ల రూపంలో రోడ్లపైకి వస్తున్నారు. పలానా పార్టీ గెలుస్తుందని, పలానా పార్టీ ఓడిపోతుందని ఉల్లాసంగా, ఉత్సాహంగా పందెం కట్టి ఓడిపోయిన వారి పరిస్థితి ఎంతో దయనీయంగా మారింది.
ఏపిలో ఇదే వ్యవహారం ఇప్పుడు పెద్ద యెత్తున చర్చనియాంశం అవుతోంది. ఎన్నికలపై పందాలు కాసిన బెట్టింగ్ రాయుళ్లు బరితెగిస్తున్నారు. మొన్న పశ్చిమగోదావరి జిల్లాలో మధ్యవర్తి ఇంటిపై బెట్టింగ్ రాయుళ్లు దాడి చేసిన దుర్ఘటన తెలిసిందే. అది మరువక ముందే.. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఏకంగా ఓ ఆస్పత్రిపై దాడిచేశారు. ఈ దాడి వెనుక ఉన్నది వైసీపీ నాయకులే అని ఆస్పత్రి యజమాని డాక్టరు రమ్య ఆరోపించింది.
నరసరావుపేటలోని శ్రీకార్తీక్ ఆసుపత్రి యజమాని డాక్టర్ వీరవల్లి రమ్య తండ్రి శ్రీమన్నారాయణ ఎన్నికల సమయంలో బెట్టింగ్ కాశారు. ఆ తర్వాత డబ్బు ఇవ్వలేదని పందెం రాయుళ్లు ఆరోపిస్తు శ్రీమన్నారాయణ దొరక్క పోవడంతో ఆయన కూతురు డాక్టర్ రమ్యకి చెందిన శ్రీకార్తిక్ ఆసుపత్రికి బెట్టింగ్ రాయుళ్లు వెళ్లారు. డబ్బులు ఇవ్వాలని అడిగారు. శ్రీమన్నారాయణ ఆచూకీ చెప్పాలని, డబ్బు ఇవ్వాలని డాక్టర్ రమ్యతో గొడవపడ్డారు.అయితే తనకి, తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని.. తనని డబ్బు అడగొద్దని రమ్య తేల్చి చెప్పడంతో కోపంతో వారు ఆసుపత్రిపై దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. డాక్టర్లు, సిబ్బందిపైనా అటాక్ చేశారు. ఈ దాడిలో ఇద్దరు డాక్టర్లకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని నర్సరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రమ్య గతంలోనూ తనను ఇలానే బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు వైసీపీ నేతలు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, బూతులు తిట్టారని వాపోయారు. మేము వైసీపీకే ఓటేశామని... కానీ ఆ పార్టీకి ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల ప్రోద్బలంతో కొందరు కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని రమ్య ఆరోపించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే ఈ దాడి జరిగిందని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే గన్ మన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడని ఆమె వెల్లడించారు.