ఆపరేషన్ గరుడలో ఐవైఆర్ దే కీలక పాత్ర:బ్రాహ్మణ చైతన్య వేదిక;పవన్ కు ప్రేమతో...
గుంటూరు:ఆపరేషన్ గరుడలో ఐవైఆర్ కృష్ణారావుది కీలక పాత్ర అని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ శిరిపురపు శ్రీధర్ ఆరోపించారు. ఆదివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఐవైఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.
బిజెపిలో చేరికతో ఐవైఆర్ తన ముసుగు తొలగించి అసలు రూపం చూపిస్తున్నాడన్నారు. బిజెపిలో చేరికతో ఐవైఆర్ తన ముసుగు తొలగించి అసలు రూపం చూపిస్తున్నాడన్నారు. బీజేపీ-వైసీపీ బంధం బలపర్చేందుకు ఐవైఆర్ కృషి చేస్తున్నారని శిరిపురపు శ్రీధర్ దుయ్యబట్టారు. ఐవైఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్రానికి తప్పుడు నివేదికలు అందిస్తున్నాడని ఆరోపించారు.
ఐవైఆర్ తన స్వార్దం కోసం బ్రాహ్మణ సమాజాన్ని తాకట్టు పెట్టవద్దని కోరుతున్నానన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని ఆపరేషన్ గరుడ రాజకీయానికి వాడుతూ ఐవైఆర్ చాలా పెద్ద పాపం చేస్తున్నాడని శిరిపురపు శ్రీధర్ ధ్వజమెత్తారు.
మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కనక దుర్గమ్మని కోరేందుకు ఆ పార్టీ కార్యకర్త ఎస్కే ఫయాజ్ వినూత్నంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి తరలివచ్చాడు. తన కోరిక నెరవేర్చాలంటూ ఘాట్ రోడ్డు నుంచి మోకాళ్లపై దుర్గగుడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్యులు, అన్ని కులాలు, వర్గాలకు న్యాయం జరగాలంటే పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పారు.
జనసేన పార్టీ బలపడకుండా తమ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫయాజ్ ఆరోపించారు. ఎపిలో జరుగుతున్న అరాచక పాలన పోయి ప్రజలు మెచ్చే పాలన రావాలని తాను కనకదుర్గమ్మను వేడుకునేందుకే ఇలా మోకాళ్లపై నడుచుకుంటూ ఇంద్రకీలాద్రికి వచ్చినట్టు ఫయాజ్ చెబుతున్నారు.