జగన్తో రమణదీక్షితులు భేటీ: తీవ్రవాది.. ఉగ్రవాది అంటూ టీడీపీపై ఐవైఆర్ ఆగ్రహం
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. దీనిపై ఐఏఎస్ మాజీ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.
ఈ మేరకు ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. రమణదీక్షితులు వైసీపీ అధినేత వైయస్ జగన్ను బహిరంగంగా కలిశారని పేర్కొన్నారు. కానీ దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ఒక టీడీపీ నేత ఇది ఆపరేషన్ గరుడలో భాగమని చెబుతున్నారని, మరొక తీవ్రవాది.. రమణదీక్షితులు జగన్కు పాదాక్రాంతుడు అయ్యాడని చెప్పారని, ఇంకొక ఉగ్రవాది.. ఇరువురికి బంధుత్వం అంటగట్టారని ఐవైఆర్ మండిపడ్డారు. శ్రీ వైష్ణవులకు ఇది కూడని పని అని వైష్ణవ సంఘాలు అన్నాయని ఒక ఛానెల్ పేర్కొందని ధ్వజమెత్తారు.
అంతకుముందు, వేమూరి ఆనంద్ సూర్య కూడా రమణ దీక్షితులుపై మండిపడ్డారు. కళ్యాణమస్తు కోసం స్వామివారి బంగారాన్ని ముంబైకి తరలించి 40 శాతం తరుగు చూపించారంటూ రమణదీక్షితులుపై ఆరోపణలు చేసారు. ఈ వ్యవహారంలో అప్పటి టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి వెయ్యి కోట్లకు పడగలెత్తారన్నారు.
సంపంగి ప్రాకారంలోని వంటశాలలో నైవేద్యం చేయవచ్చని రమణ దీక్షితులు లేఖ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి, మిట్ట మధ్యాహ్నం డ్యూటీలతో అర్చకులను వేధించిన ఘనత రమణదీక్షితులుదన్నారు. బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాల్లో భాగస్వామిగా మారి, రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు సహకరిస్తే బ్రాహ్మణులే బుద్ధి చెబుతారన్నారు. పొట్ట నింపుకోవడానికి అన్యమతస్తుడైన జగన్ ఇంటికి వెళ్లాలా అన్నారు.