టిటిడిపై దుష్ప్రచారం టీడీపీ ఐటీ విభాగం పనే:సీఎంకు ఐవైఆర్ కృష్ణారావు లేఖ
అమరావతి:టిటిడిని కేంద్రం స్వాధీనం చేసుకోబోతోందని, దీనివెనుక నా హస్తం ఉందంటూ జరిగిన ప్రచారం వెనుక టీడీపీ ఐటీ విభాగం ఎపి మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు.
మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పనిచేసే టిడిపి ఐటి విభాగం వారే ఇలా ప్రత్యేకంగా కొన్ని వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఐవైఆర్ సంచలన ఆరోపణలు చేశారు. టిటిడి వివాదంతో తనకు ముడి పెట్టడాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు.
తప్పుడు సమాచారం...తప్పుదోవ
తిరుమల తిరుపతి దేవస్థానాలను కేంద్రం స్వాధీనం చేసుకోబోతోందని కొన్ని ప్రసార మాధ్యమాలు తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాయని సిఎం చంద్రబాబుకు రాసిన తన బహిరంగ లేఖలో ఎపి ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. ఈ కుట్రలో తాను భాగస్వామినంటూ జరిగిన ప్రచారం వెనుక టీడీపీ ఐటీ విభాగం ఉందంటూ ఆయన తన లేఖలో ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో పనిచేసే ఐటీ విభాగంలోని కొందరు దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారని ఐవైఆర్ కృష్ణారావు ధ్వజమెత్తారు.
ఇలా చేయడం తప్పు...బాబు బాధ్యత
టిడిపి ఈ విధంగా చేయడం తప్పని, ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయడం సరికాదని ఆయన చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. టిడిపి ఇటువంటి వాటికి కేంద్ర బిందువు కాకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.
నేను టిటిడి ఈవోగా...ఆ లేఖ ఆధారమా?
2011లో టీటీడీ ఈవోగా పనిచేస్తున్న సమయంలో తాను రాసిన లేఖ ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందంటూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఐవైఆర్ ఖండించారు. ఈ విధమైన అపోహలు ప్రజల్లోకి వెళ్లడానికి చంద్రబాబు కారణమయ్యారంటూ ఆరోపించారు.
చట్టంలో సవరణలు...ఇలా చేయండి
1958 నాటి పురాతన కట్టడాల చట్టం ప్రకారం ఏదైనా కట్టడాన్ని పరిరక్షిత కట్టడంగా లేదా జాతీయ ప్రాధాన్యం ఉన్న కట్టడంగా నిర్ణయిస్తే ఆ కట్టడం పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్లాల్సి ఉంటుందన్నారు. అదే జరిగితే ఆ కట్టడం జీవకళ తప్పిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ చట్టంలో సవరణలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐవైఆర్ సూచించారు. కట్టడాల్లో శాశ్వత మార్పులూ చేర్పులూ చేయాలనుకుంటే పురావస్తు శాఖ అనుమతి తప్పనిసరి చేస్తూ చట్టాన్ని సవరించడమే ఈ సమస్యకు పరిష్కారంగా ఐవైఆర్ పేర్కొన్నారు.