'కావాలనే విశాఖ రైల్వే జోన్పై కేంద్రం నిర్లక్ష్యం, రాజకీయాలకు అతీతంగా పోరాటం'
అమరావతి: విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని, జోన్ సాధనా దిశగా పోరాడానికి సిద్ధమని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ రైల్వే జోన్ అన్నారు. దానిని సాకారం చేసేందుకు కలిసి పోరాడుదామన్నారు.
రాజకీయాలకు అతీతంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా పోరాడేందుకు అన్ని వర్గాలతో కలిసి ఉద్యమం నిర్మించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. గంటా ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన సమావేశంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
విభజనలో భాగంగా రైల్వే జోన్ హామీ నెరవేరుతుందని భావిస్తే, దానిని కేంద్రం ఆలస్యం చేస్తోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. రైల్వే జోన్ సాధన పోరాటం దిశగా కీలకమైన ముందడుగు పడిందని ఈ సందర్భంగా గంటా అన్నారు.
రాజకీయేతర జేఏసీ జోన్ కోసం పోరాటం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా పోరాటంలో పాల్గొనేందుకు ముందుకు రావాలన్నారు.