అందుకే బాబు మాతో కయ్యం: జగదీష్, అక్కసుతో జగన్: కెఇ
హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించే ప్రసక్తే లేదని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తేల్చి చెప్పారు. ‘ఇంటర్ బోర్డు మాదే.. పరీక్షలు మేమే నిర్వహించుకుంటాం' అంటూ ప్రకటించారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి ఉందన్నారు.
పరిశ్రమలకు అనువైన విద్యాబోధన చేపడతామని, ఇందుకోసం ట్రిపుల్ఐ(ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్) సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారంలో పరిశ్రమలు, విద్యావేత్తలతో సమావేశం నిర్వహించి తదుపరి ప్రణాళికలు వెల్లడిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమస్యల నుంచి తప్పించుకునేందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వంతో కయ్యానికి దిగుతున్నారని ఆయన విమర్శించారు. ఉమ్మడి పరీక్షలను తాము నిర్వహిస్తామని చెప్పితే ఎపి ప్రభుత్వం ముందుకు రాలేదని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఎంసెట్ నిర్వహణ ఎపి ప్రభుత్వ వైఖరిపై ఆధారపడి ఉంటుందని జగదీష్ రెడ్డి చెప్పారు.
కాగా, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యామంత్రి చైర్మన్గా, ఉన్నత విద్యా కార్యదర్శి వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు.
రుణమాఫీ విజయవంతమవుతుందనే అక్కసుతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విమర్శలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. తమది చేతల ప్రభుత్వమని, చంద్రబాబు రుణమాఫీ చేసి తీరుతారని ఆయన చెప్పారు. రుణమాఫీని అడ్డుకునే ప్రయత్నాలను జగన్ ఇకనైనా ఆపాలని ఆయన సూచించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగా లేకున్నా చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ఆయన అన్నరాు.
ఇదిలావుంటే, చరిత్రలో దళితులకు ద్రోహం చేసిన వారిలో తొలి స్థానం కాంగ్రెస్దేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్బాబు తెలిపారు. గుంటూరులో బుధవారం మీడియాతో మాట్లాడారు. 60 ఏళ్ళుగా దళితుల ఓట్లతో అధికారం అనుభవించి వారిని అణగదొక్కిన ఘనత ఆ పార్టీదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలను కాంగ్రెస్ 18 కోట్లను విడుదల చేస్తే తమ ప్రభుత్వం 430 కోట్లను కేటాయించందన్నారు. విభజన కుట్రలో భాగస్తులైన కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్లు కూడపలుక్కుని చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఉనికి కాపాడుకునేందుకే వైసీపీ ధర్నా రాజకీయాలకు దిగుతుందన్నారు.