చేతకాని దద్దమ్మ: బాబుపై జగదీశ్, జవాబు చెప్పాలని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఓ చేతకాని దద్దమ్మ అని విమర్శించారు. ప్రజల్ని మోసం చేయడం ఎలాగో బాబుకే తెలుసని అన్న ఆయన, ఎన్నికలు ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను మోసం చేయడానికే తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారని ఆరోపించారు.
పూర్తిగా రైతు రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు.. ఇప్పుడు డ్వాక్రా రుణాలపై కూడా షరతులు పెడుతున్నారని జగదీశ్ ఆరోపించారు. చంద్రబాబుకు చెప్పింది చేయకపోవడం.. చేసేది చెప్పకపోవడం అలవాటేనని విమర్శించారు. తమ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా వారి జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
ఎంసెట్ అడ్మిషన్లపై చంద్రబాబు ప్రభుత్వం లేనిపోని రాద్ధాంతం చేస్తోందని అన్నారు. స్థానికతను చంద్రబాబు ఎలా నిర్ణయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇటీవల ఏపి మంత్రి గంటా శ్రీనివాస్, మరో మంత్రి మాట్లాడుతూ తమ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు తామే ఫీజులు చెల్లించుకుంటామని చెప్పారని, అయితే నాలుగు రోజుల తర్వాత వారు మాటమార్చి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని మాటమార్చారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. మీ విద్యార్థులకు మరొకరిని ఫీజులు చెల్లించమని ఎలా అడుగుతారని ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఓ వైపు తెలంగాణలోని లక్షలాది గిరిజనులను ముంచుతూ.. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కూడా ప్రయోజనమని చంద్రబాబు చెబుతున్నారని, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వల్ల కూడా తెలంగాణకు ప్రయోజనం ఉంటుందని బాబు చెప్పగలరని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వంపై కాలుదువ్వుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అనవసరంగా బద్నాం చేయడం సరికాదని సూచించారు. తాము రాజకీయ సీనియర్లమని చెప్పుకోవడం కాదని.. అదేవిధంగా ప్రవర్తించడం నేర్చుకోవాలని చంద్రబాబుకు ఆయన సూచించారు.
పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించాలని అన్నారు. తెలంగాణలోని చంద్రబాబు పార్టీ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారని.. వారందరూ బాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని జగదీశ్ అన్నారు. తమ రాష్ట్ర సిఎం ఏపి గురించి గానీ, ఆ రాష్ట్ర సిఎం గురించి మాట్లాడటం లేదని చెప్పారు. సొంత రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించలేని చంద్రబాబు.. పక్క రాష్ట్రంపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. పునర్వవ్యస్థీకరణ చట్టంలో ఉన్నదే తాము చేస్తున్నామని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే మాట్లాడుకుందామని, తాము ఎప్పుడూ సిద్ధమేనని జగదీశ్ అన్నారు.