జగన్ విదేశాలకు..!చంద్రబాబు ఇరిటేషన్ లోకి..! ఏపిలో ఏం జరుగుతోంది..!!
అమరావతి/హైదరాబాద్ : ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏపిలో పరిస్థితులు వాడివేడిగా కొనసాగాయి. ఎన్నడూ లేని విధంగా అదికార పార్టీ అన్ని అంశాల్లో చుక్కెదురు కాగా, ప్రతిపక్ష వైసీపి మాత్రం ప్రశాంతంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదులో భాగంగా వేసవి విడిది కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి విదేశాలకు వెళుతున్నారు. లోటస్ పాండ్ నుంచి నేరుగా విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు జగన్. ఐదురోజుల పాటు స్విట్జర్ లాండ్ దేశంలో జగన్ పర్యటిస్తారు. తిరిగి ఈనెల 27 రాత్రి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. జగన్ వెంట ఆయన భార్య, కుమార్తెలు బయలుదేరుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. ఇదిలా ఉంటే ఏపిలో అదికార టీడిపి అద్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రం రోజురోజుకు అసహనం పెరిగిపోతోంది. అసలు ఏపిలో రాజకీయంగా ఏంజరుగుతోంది..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
ఏపిలో విచిత్ర పరిణామలు..! బాబుకు సహకరించని యంత్రాంగం..!!
ఏపిలో రాజకీయ పరంగా విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలకు మరో నెల రోజుల సమయం ఉంది. అప్పటి వరకూ రాష్ట్ర పాలన ఎలా సాగాలి. ఎవరు సమీక్షలు చేయాలి. వేసవిలో తాగునీటి ఎద్దడి, ప్రకృతి వైపరీత్యాలు, శాంతిభద్రతల పర్యవేక్షణ ఎలా నిర్వర్తించాలి. ఏపీలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి ఆ అధికారం లేదా! ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ఇవన్నీ చేయకూడదా! నిజమే.. సంక్లిష్ట సమయం. ఏపీ ప్రజలు కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి రాజకీయ ఆస్థిరత చవిచూడలేదు. మొన్న పోలవరం, తరువాత తాగునీటి పై చంద్రబాబు సమీక్షించటాన్ని వైసీపీ తప్పుబట్టింది. కోడ్ ను బూచిగా చూపుతూ ఈసీకు ఫిర్యాదు చేసింది. వారు కూడా తమ బాధ్యత ప్రకారం సమీక్ష సమావేశాలకు హాజరైన అధికారులకు నోటీసులు జారీచేశారు. సంజాయషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
కోడ్ పేరుతో ఇబ్బందులు..! ప్రభుత్వాన్ని సంజాయిషీ అడిగిన ఈసీ..!!
దీనిపై చంద్రబాబు, లోకేష్ అండ్ తెలుగు తమ్ముళ్లు గట్టిగానే ఈసీను నిలదీస్తున్నామంటున్నారు. ఈసీ మాత్రం ఏం చేస్తుంది. తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. నెలరోజుల పాలన గాలికి వదిలేయటం అంటే ప్రజల ఇబ్బందులను కూడా పట్టించుకోకపోవటమే. అసలే చంద్రబాబుకు ఏపీ ప్రజలంటే విపరీతమైన అభిమానం. వారి కోసం ఏదో ఓకటి చేయాలని తపన ఉన్నప్పటికి బాబుకుపరిస్థితులు అనుకూలించడం లేదని చెప్పాలి. ఉద్యోగులు మూడు నెలలుగా జీతాలు రాక కొత్త ప్రభుత్వం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల కూడా డబ్బులు చేతికి అందకపోతే.. జూన్లో పిల్లలకు ఫీజులు కూడా కట్టలేమని ఓ పక్క ఉద్యోగులు తెగేసి చెప్తున్నారు.
ఏపిలో రాజకీయ అస్థిరత..! ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదికారులు..!!
ఈ నేపథ్యంలో వైసీపీ ప్రతిరోజూ ఏదోఒక అంశాన్ని చూపుతూ ఈసీకు పిర్యాదు చేస్తోంది. ఇదంతా మోడీ కుట్రేనంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ జనాలకు ఇదంతా సర్వసాధారణం కావటంతో కొత్తగా భావించేది ఏమీ లేదనన్నట్టు చూస్తున్నారు. రాజకీయ అస్థిరత ఏర్పడిన రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి పాలన విధించే అవకాశంపై న్యాయ నిపుణులు అంచనాలు వేస్తున్నట్టు కూడా చర్చ జరుగుతోంది.
ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూపి..! టెన్షన్ లేని ప్రతిపక్ష పార్టీ..!!
పైగా ఎన్నికల ఫలితాల రోజున రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం లేకపోలేదని ఇప్పటికే నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏ మాత్రం మే 23న శాంతిభద్రతలు అదుపుతప్పినా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులను కాపాడే అంశంలో కేంద్ర రాజీపడబోదనేది మాత్రం సూచనప్రాయంగా గవర్నర్కు వచ్చిన సందేశమని తెలుస్తోంది. ఏపిలో ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల మద్య చంద్రబాబు కాలం వెళ్ల దీస్తుంటే ప్రతిపక్ష నేత మాత్రం తనకేమీ పట్టనట్టు విదేశాలకు వెళ్లడం చర్చనియాంశంగా మారింది.