జగన్ డ్రీం కేబినెట్ సిద్దం: సామాజిక కూర్పు ఇలా..మంత్రులుగా వీరికేనా ఛాన్స్: రేపు ఫైనల్..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ డ్రీం కేబినెట్ సిద్దమైంది. అన్ని ప్రాంతాలు..సామాజిక సమీకరణాలను పరిగణలోని తీసుకొని జగన్ తుది రూపు ఇస్తున్నారు. ఎన్నికల వేళ..అభ్యర్దుల ఎంపికలో ఎంత పక్కాగా సమీకరణాల వారీగా ఖరారు చేసారో అదే ఫార్ములాను ఇప్పుడు అనుసరిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోటీ సైతం ఎక్కువ గానే ఉంది. దీంతో..సీనియర్ల..జూనియర్ల సమతూకంతో కేబినెట్ ఖరారు చేస్తున్నారు. తాను తన టీంను ఏరకంగా ఎంపిక చేసుకుందీ జగన్ రేపటి సమావేశంలో వెల్లడించనున్నారు.
జగన్ కూర్పు ఇలా..
జగన్ తన డ్రీం కేబినెట్ను ఎంపిక చేసుకోవటంలో సామాజిక సమీకరణాలకు పక్కాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో మంత్రుల సంఖ్య పెంచుతున్నారు. సీనియర్లు..జూనియర్లును కలగలుపుతూ.. అదే సమయంలో మహిళలు..ఎస్సీ-ఎస్టీలకు ప్రాధాన్యత తగ్గకుండా చూసుకుంటూ..ప్రతీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించేలా జగన్ తుది రూపు ఇస్తున్నారు. ఇక, సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే మొత్తం 25 మందితో ఏర్పాటు చేసే ఈ కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి ఏడు స్థానాలు, బీసీ వర్గాలకు ఆరు స్థానాలు, కమ్మ వర్గానికి రెండు బెర్తులు, ఎస్సీ మాల- 1, ఎస్సీ-మాదిగ-1, ఎస్టీ-1, క్షత్రియ-ముస్లిం మైనార్టీ-బ్రాహ్మణ- వైశ్య వర్గాలకు ఒక్కో స్థానం చొప్పున బెర్తులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.
వర్గాల వారీగా అవకాశాలు ఉన్నవారు..
రెడ్డి వర్గం నుండి ఏడుగురికి అవకాశం ఇస్తే..ఆ వర్గం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, మేడా మల్లిఖార్జున రెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక, బీసీ వర్గానికి చెందిన ఆరు బెర్తులు..తమ్మినేని సీతారం, పిల్లి సుభాష్ చంద్రబోస్, పి పార్ధసారధి, మోపిదేవి వెంకటరమణ, ముత్యాల నాయుడు, కాపు రామచంద్రారెడ్డి పేర్లు రేసులో ఉన్నాయి. కమ్మ వర్గం నుండి కొడాలి నాని, మర్రి రాజశేఖర్ మంత్రి పదవులు దక్కించుకోనున్నారు. ఎస్సీ మాల వర్గం నుండి మేకతోటి సుచరిత, తూర్పు గోదావరి నుండి విశ్వరూప్ ముందంజలో ఉన్నారు. ఇక, ఎస్టీ మాదిగ వర్గం నుండి ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్కు దక్కే అవకాశం ఉంది. ఎస్టీ వర్గం నుండి కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణి పేరు వినిపిస్తోంది. క్షత్రియ వర్గం నుండి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రసాదరాజు, ముస్లిం మైనార్టీ కోటాలో తాజాగా జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని ప్రకటించిన ఇక్బాల్, బ్రాహ్మణ వర్గం నుండి కోన రఘుపతి లేదా మల్లాది విష్ణు, వైశ్య వర్గం నుండి కొలగట్ల వీరభ్రద స్వామి పేర్లు రేసులో తుది జాబితా వరకు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
కాపు కోటాలో వీరేనా..రేపు ఫైనల్..
ఇక, జగన్ కేబినెట్లో కాపు వర్గానికి రెండు సీట్లు ఇస్తారని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర నుండి మాజీ ఎంపి..ప్రస్తుత భీమలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస రావు, కాకినాడ రూరల్ నుండి గెలిచిన కురసాల కన్నబాబు లేదా దాడిశెట్టి రాజాల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. జగన్ కేబినెట్లో ఉత్తరాంధ్ర నుండి అయిదుగురు, రాయలసీమ నుండి సీఎం జగన్ కాకుండా మరో అయిదుగురు, కోస్తాలోని ఆరు జిల్లాల నుండి సామాజికవర్గాల వారీగా పదిహేను మందికి చాన్స్ దక్కనుంది. ఇక, శుక్రవారం జగన్ ఏర్పాటు చేసిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో తన కేబినెట్లో ఎవరికి ఛాన్స్ ఇస్తుందీ..తన లక్ష్యాలు..పరిగణలోకి తీసుకున్న అంశాలు వివరించటంతో పాటుగా మంత్రుల పేర్లు ప్రకటించనున్నారు. ఇక, డిప్యూటీ స్పీకర్గా మహిళకు అవకాశం ఇవ్వనున్నారు.