జగన్ , చంద్రబాబు రెండూ ఒక తాను ముక్కలే .. సీపీఐ నారాయణ
ఏపీలో మూడు రాజధానుల ప్రకటనపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి హై పవర్ కమిటీ నివేదిక తర్వాత రాజధాని విషయంలో తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పినప్పటికీ రాజధాని అమరావతి రైతులు మాత్రం తమ నిరసన దీక్షలను విరమించేది లేదని ఇంకా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ జగన్, చంద్రబాబు ఇద్దరూ దొందూ దొందే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజధాని భూములు ప్రభుత్వాల సొంత ఆర్ధిక ప్రయోజనాలకు వేదిక అన్న నారాయణ
భూముల దోపిడీ దొంగల్ని కాపాడడంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, తాజా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ ఒకే తాను ముక్కలని సిపిఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు. రాజధాని భూములు ప్రభుత్వాలకు సొంత ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయని, నేతల ఆర్ధిక అవసరాలకు వేదికగా మారాయని అందుకే రాజధాని భూముల విషయంలో ఈ రగడ కొనసాగుతుందని నారాయణ పేర్కొన్నారు.
వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రాజధాని మార్పు అంశం ప్రస్తావన లేదన్న నారాయణ
రాజధాని మార్పు అంశం రైతులు నిరసన దీక్షలు పై స్పందించిన ఆయన రాజధాని పేరుతో చంద్రబాబు వేల ఎకరాలను సేకరించి రాజధాని నిర్మాణం చేయాలని భావిస్తే, సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ భూములను సెజ్ ల పేరుతో పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల మేనిఫెస్టోలో మూడు రాజధానులు ప్రస్తావించని జగన్ కు రాజధాని మార్చే నైతిక హక్కు లేదని నారాయణ పేర్కొన్నారు.
మళ్ళీ ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు తర్వాతే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
రాజధానిని మార్చాలని జగన్ అనుకుంటే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, ప్రజాతీర్పు అడగాలని సూచించారు నారాయణ. రాజధానిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని నారాయణ పేర్కొన్నారు . నాడు విశాఖ భూకుంభకోణం పై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పని, నేడు సీఎం జగన్ కూడా చేస్తున్నాడని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై సీపీఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు.
రాజధాని రైతుల పక్షానే సీపీఐ
రాజధాని అమరావతినే అని అమరావతి విషయంలో స్ట్రాంగ్ గా తమ స్టాండ్ ను ప్రకటించిన సీపీఐ జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తూనే ఉంది. అందులో భాగంగానే సీపీఐ నేతలు జగన్ తీరుపై నిరసన తెలియజేస్తున్నారు. రాజధాని రైతుల కోసం తమ పోరాటం సాగిస్తామని చెప్తున్నారు.