పించన్లపై ఎల్లో మీడియా దుఫ్ర్చచారం- టీడీపీ తీరుపై జగన్ సీరియస్- స్పీకర్ ఆవేదన
ఏపీలో పింఛన్ల పెంపు వ్యవహారం అసెంబ్లీలో రెండోరోజు కూడా చర్చకు వచ్చింది. పించన్ల విషయంలో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా టీడీపీ వ్యవహరించిన తీరుపై స్పీకర్ తమ్మినేనితో పాటు సీఎం జగన్ కూడా అసంతృప్తి వ్యక్తంచేశారు. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, వాటిని ఎల్లో మీడియా బ్యానర్లు వేయడంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పింఛన్ల వ్యవహారంపై నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ, టీడీపీ సభ్యుల ప్రవర్తన, అసెంబ్లీ ముగిశాక చంద్రబాబు స్పందించిన తీరుపై ఇవాళ పత్రికల్లో పలు వార్తలు వచ్చాయి. వీటిని అసెంబ్లీలో ప్రస్తావించిన మంత్రి కన్నబాబు టీడీపీ తీరుపై విరుచుకుపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్నే బెదిరించేలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన నానాటికీ హద్దులు దాటుతోందన్నారు. అనంతరం ఇదే అంశంపై స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తన దారుణంగా ఉంటోందన్నారు. ఇలాంటి ప్రవర్తనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని సభా నాయకుడైన సీఎం జగన్కే వదిలిపెడుతున్నామన్నారు.
Recommended Video
అనంతరం మాట్లాడిన సీఎం జగన్... పించన్ల వ్యవహారంపై అసెంబ్లీ, బయట టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎల్లో మీడియా అసత్యాలు ప్రచురించిందని మండిపడ్డారు. స్పీకర్ పోడియం వద్దకు సభ్యులను పంపి గందరగోళం సృష్టిస్తున్నారని, సభ నుంచి సస్పెండ్ చేయించుకుని కొన్ని మీడియా సంస్ధలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని ఆరోపించారు. ఎల్లో మీడియాలో తమ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. నిన్న చెప్పిన విధంగా వచ్చే జూలైలో పింఛన్ల పెంపు ఉంటుందన్నారు.