సొంత పార్టీ నేతలకు సీఎం జగన్ జలక్: ఎమ్మెల్యేల బంధువులకు నో ఛాన్స్: పదవులు ఉండవ్..!
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్నయం తీసుకున్నారు. ఇప్పటికే జెడ్పీటీపీ..ఎంపీటీసీ పదవుల కోసం ముమ్మరంగా నామినేషన్ల ప్రక్రియ సాగుతోంది. ఈ రోజు నుండి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఇదే సమయంలో వైసీపీ అధినేత అనూహ్య నిర్ణయం ప్రకటించారు. సొంత పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. రిజర్వేషన్ల ఆధారంగా తమ బంధువులు..కుటుంబ సభ్యులకు పదవులు దక్కేలా ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు..నియోజకవర్గాల సమన్వయకర్తలు నామినేషన్లు దాఖలు చేయిస్తున్నారు. ఇంతకీ వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఏమిటి..? నేతల్లో టెన్షన్ ఎందుకు మొదలైంది..?
నత్వానీ ఇష్యూలో కొత్త ట్విస్ట్: జగన్ ఇలా ఫిక్స్ చేసేశారు: ఇక..ట్రబుల్ షూటర్ సీఎం చేతిలోనే...!
ఇప్పటికే నామినేషన్ల దాఖలు..
స్థానిక సంస్థల్లో తమ వారసులను దింపి..పదవులు దక్కించుకోవాలనే ఉద్దేశంతో పలు చోట్ల ఎమ్మెల్యేలు..వైసీపీ నియోజవర్గ సమన్వయకర్తలు తమ వారితో నామినేషన్లు దాఖలు చేయించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖ..శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటికే పలువురి నేతల వారసులు నామినేషన్లు దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా నెల్లూరు..గుంటూరు జిల్లాల్లోనూ తమ వారసులను రంగంలోకి దించేందుకు అధికార పార్టీ నేతలు ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ తాజాగా తమ నిర్ణయం ప్రకటించింది .ఎక్కడైనా బంధువుల..నియోజకవర్గాల సమన్వయకర్తలు తమ బంధువులతో నామినేషన్లు దాఖలు చేయిస్తే వారికి భీ పారంలు ఇవ్వద్దని..పార్టీ అధినేత ఆదేశంగా సందేశాలు పంపించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి రీజనల్ కో ఆర్డినేటర్లకు ఆదేశాలు వెళ్లాయి
నామినేషన్లు ముగిసే సమయంలో నిర్ణయం
ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయటం..ముగింపు సమయం దగ్గర పడటంతో వారి విషయంలో ఏం చేయాలనేది ఇప్పుడు ఎమ్మెల్యేలకు టెన్షన్ పెట్టిస్తోంది. తమ వారసులు కావటంతో పోటీ లేకుండా.. పార్టీ నేతలను అనేక చోట్ల నేతలు మేనేజ్ చేశారు. ఇప్పుడు వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటే సమస్యగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు నామినేషన్ల చివరి సమయంలో పార్టీ ఆదేశాలు హాట్ టాపిక్ గా మారాయి.
పదవులు మాత్రం దక్కవ్
నామినేషన్లు దాఖలు చేసి బరిలో నిలిచినా..వారి పదవులు రద్దవుతాయంటూ పార్టీ చేస్తున్న హెచ్చరికలు వారికి మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దీని పైన రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు రీజనల్ ఇంఛార్జ్ లుగా నియమించిన ఐదుగురు జాగ్రత్తగా పర్యవేక్షించాలని పార్టీ ఆదేశించింది. బీ ఫారంలు జారీ అధికారం సైతం వారికే అప్పగిచింది. దీంతో..ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎమ్మెల్యేలు..సమన్వయకర్తల బంధువులు ఎవరైనా ఉన్నారా అనే సమాచారం పైన నేతలు ఆరా తీస్తున్నారు. పార్టీ విధి విదానాలకు లోబడి వ్వవహరించాల్సిందేనని తేల్చి చెప్పారు. తాజాగా సీఎం తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం పార్టీలో హాట్ టాపిక్ గా మారుతోంది.