ఒక్కసారి మా అబ్బాయిని చూపించండి...పోలీసులకు శ్రీనివాస్ తల్లిదండ్రుల వేడుకోలు:విశాఖకు తరలింపు
తూర్పుగోదావరి:జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ ప్రస్తుతం విశాఖలో పోలీస్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం శ్రీనివాస్ అస్వస్థతకు గురైనట్లు మీడియాలో వార్తలు రావడంతో అతడి తల్లిదండ్రులు ఆందోళనకు లోనయ్యారు.
ప్రస్తుతం శ్రీనివాస్ తల్లిదండ్రులను కూడా వారి స్వగ్రామం ఠానేలంకలో సిట్ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో తమ కుమారుడి ఆరోగ్యం గురించి తమకు ఆందోళనగా ఉందని, అతడిని ఒక్కసారి తమకు చూపించాలని శ్రీనివాస్ తల్లిదండ్రులు సిట్ పోలీసులను కోరారని తెలిసింది. పదే పదే వారు అభ్యర్థిస్తున్న నేపథ్యంలో పోలీసులు శ్రీనివాస్ను చూపేందుకు అతడి తల్లిదండ్రులను విశాఖ తీసుకెళ్లారని సమాచారం.
నాలుగో రోజు...సిట్ విచారణ
ఈనెల 25న విశాఖ ఎయిర్పోర్టులో ప్రతిపక్ష నేత జగన్పై శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగో రోజు సిట్ అధికారులు శ్రీనివాస్ను విచారిస్తున్నారు. ప్రధానంగా శ్రీనివాస్ ఫోన్లోని కాల్డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్న సిట్ అధికారులు...దాడి ఘటనకు రెండు రోజుల ముందు కాల్ డేటా వివరాలు సేకరించారు. మరోవైపు శ్రీనివాస్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని ఠానేలంకలో అతడి తల్లిదండ్రులను విచారిస్తున్న సిట్ బృందం తమ కుమారుడి ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో వారిని విశాఖకు తరలించారు.
కాల్ డేటా...అదే ప్రధానంగా
ప్రధానంగా శ్రీనివాస్ ఫోన్లోని కాల్డేటా ఆధారంగా విచారణ కొనసాగిస్తున్న సిట్ బృందం జగన్ పై దాడికి కొన్నిగంటల ముందు శ్రీనివాస్ ఎవరెవరితో మాట్లాడాడనే విషయంపై దృష్టి పెట్టారు. ఆ క్రమంలో శ్రీనివాస్ దాడికి ముందు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఒక యువతితో మాట్లాడినట్టు నిర్థారించారు. శ్రీనివాస్ కు ఆమెకు మధ్య ఒక మిస్డ్ కాల్ వల్ల పరిచయం అయినట్లు తెలిసింది. ఆ మేరకు కనిగిరి నుంచి యువతి,ఆమె తోడికోడలు ఆమె సోదరుడిని విచారణ నిమిత్తం విశాఖకు తీసుకొచ్చారు.
ఆ ఇద్దరు మహిళలు...ఎవరంటే?
శ్రీనివాస్ తో పరిచయం గురించి ఆమెని ప్రశ్నించగా...ఇటీవలే మిస్డ్ కాల్ వల్ల తమకు పరిచయం ఏర్పడిందని...అలా కొంతకాలంగా ఫోన్ ద్వారా మాట్లాడుకోవడం జరుగుతుందని చెప్పినట్లు తెలిసింది. ఘటన జరిగిన రోజు అతడు నాతో, నా తోడికోడలితో కూడా మాట్లాడాడని చెప్పినట్లు సమాచారం. అయితే మేము నిన్ను ఎలా చూడాలని ఆమె శ్రీనివాసరావును ప్రశ్నించగా...‘కాసేపట్లో జగన్పై దాడి చేస్తా...టీవీలో చూడు' అని శ్రీనివాస్ చెప్పాడని తెలిపారట. ప్రస్తుతం వీరు సిట్ అధికారుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.
విమానాశ్రయంలో భద్రత...పిల్
ఇదిలావుంటే విశాఖపట్నం విమానాశ్రయంలో భద్రతా లోపాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణను హైకోర్టు వారం రోజులకు వాయిదావేసిందని తెలిసింది. ఈ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ పై కోడి కత్తితో దాడి జరిగిన నేపథ్యంలో...గుంటూరు జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్, కడప జిల్లాకు చెందిన ఎం.అమరనాథ్రెడ్డి సంయుక్తంగా వ్యాజ్యం దాఖలు చేయగా మంగళవారం విచారణకు వచ్చింది. కోర్టు ప్రారంభ సమయంలోనే పిటిషనర్ తరపు న్యాయవాది విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో విచారణను వారం రోజులకు వాయిదావేస్తూ చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.