జగన్ పై దాడి నేనే చేశా;నా వెనుకెవరూ లేరు;జగన్ కు కూడా తెలియదు;నాకు ప్రాణహాని:శ్రీనివాస్
విశాఖపట్నం:"వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు దేవుడు...జగన్ అంటే అభిమానం...ఆయనకు దాడి విషయం ఏమీ తెలియదు..నావెంట ఎవరూ లేరు...నా అంతట నేనే చేశా"...ఇవీ ప్రతిపక్షనేత జగన్పై కత్తితో దాడిచేసిన శ్రీనివాసరావు మీడియాతో చెప్పిన మాటలు.
అస్వస్థతకు గురైనట్లు చెప్పడంతో శ్రీనివాస్ ను విశాఖ కెజిహెచ్ కు తరలించిన సందర్భంలో అతడు మీడియాతో మాట్లాడాడు. "జగన్పై దాడి రాజకీయంగా మారిపోయింది...నా ప్రాణాలకు హాని ఉంది...రక్షణ కల్పించాలి...నన్ను చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారు...ఒకవేళ నేను చనిపోతే నా అవయవాలను దానం చేయండి"...అని శ్రీనివాస్ మీడియా ద్వారా కోరాడు.
శ్రీనివాస్ అస్వస్థత...పెనుదుమారం
జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ అస్వస్థత అంశం ఎపి రాజకీయాల్లో పెనుదుమారం రేపింది. పోలీసుల విచారణ సందర్భంగా మధ్యాహ్నం సమయంలో శ్రీనివాస్ తనకు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పాడు. దీంతో పోలీసులు సమీపంలో ఉన్న కమలా నర్సింగ్హోమ్ వైద్యుడు డాక్టర్ దేముడుబాబును స్టేషన్కు రప్పించి శ్రీనివాస్ కు వైద్య పరీక్షలు చేయించారు. ఛాతీ నొప్పితోపాటు ఎడమ చేయి నొప్పిగా ఉందని శ్రీనివాసరావు చెప్పడంతో వైద్యుడి సూచన మేరకు కేజీహెచ్కు తీసుకువెళ్లాలని డాక్టర్ సూచించారు. దీంతో శ్రీనివాస్ ను కేజీహెచ్కు తీసుకెళ్లారు.
ప్రాణహాని ఉంది...కాపాడండి
వైద్య పరీక్షల నిమిత్తం శ్రీనివాస్ ను కేజీహెచ్లో కార్డియాలజీ విభాగానికి వీల్చైర్లో తరలిస్తుండగా...అక్కడున్న మీడియానుద్దేశించి మాట్లాడాడు. "జగన్ను అందరూ దేవుడిగా చూడాలనుకునే దాడిచేశాను. నా ఆలోచనలు ఆయనకు చేరాలని...ప్రజలంతా హ్యాపీగా ఉండాలనే అలా చేశాను. ప్రతి పేదవాడూ వైఎస్ ను ఎలా దేవుడని అనుకున్నారో జగనన్నను కూడా అలాగే అనుకోవాలని చేశాను. నాకు ప్రాణ హాని ఉంది. నన్ను చంపేసి రాజకీయం చేయాలని చూస్తున్నారు. నన్ను కాపాడండి సార్" అని విలేకరులతో అన్నాడు. వైద్య పరీక్షల అనంతరం అతడిని తిరిగి స్టేషన్కు తరలించేందుకు వాహనం వద్దకు తీసుకొస్తుండగా ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించాలంటూ అతడు పోలీసులను ప్రాధేయపడ్డాడు.
ఎవరి నుంచో...అతడే చెప్పాలి...
మరోవైపు జగన్పై దాడి చేసిన శ్రీనివాసరావు వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని విశాఖ కమిషనర్ మహేశ్చంద్ర లడ్హా పునరుద్ఘాటించారు. శ్రీనివాస్ పై ఎలాంటి ఒత్తిడి లేదని...అతడికి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారని...ఎవరి నుంచి ప్రాణహాని ఉందో అతడే చెప్పాలని లడ్హా అన్నారు. విచారణకు శ్రీనివాస్ పూర్తిస్థాయిలో సహకరించడం లేదని చెప్పారు. ఎయిర్పోర్టు పోలీసుస్టేషన్లో శ్రీనివాసరావును మూడో రోజు విచారించాక కమిషనర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.
వైసిపి నేతల వాంగ్మూలం...న్యాయమూర్తి ముందు
అలాగే సిట్ విచారణకు వైసీసీకి చెందిన కృష్ణకాంత్, శ్రీధర్ మాత్రమే విచారణకు హాజరయ్యారని, మిగిలిన వారికి నోటీసులు అందజేశామని వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని లడ్హా తెలిపారు. దాడి సంఘటనపై సిట్ విచారణ తూర్పుగోదావరిలో శ్రీనివాసరావు స్వగ్రామమైన ఠాణేలంక పెదపేటలోను,ముమ్మిడివరంలోను కొనసాగుతోంది. మంగళవారం నాటికి మొత్తం 24మందిని విచారించారు. జగన్పై దాడి కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావులకు సిట్ అధికారులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. అయితే, వీరు మాత్రం తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు న్యాయమూర్తి ముందు మాత్రమే వాంగ్మూలం ఇస్తామని చెప్పినట్లు తెలిసింది.