విశాఖకు రాజధాని షిఫ్ట్: కేసీఆర్ మాదిరిగానే సీఎం జగన్.. అమరావతి రైతుల వేదన అరణ్య రోదనేనా?
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీఎం కేసీఆర్ లా మోనార్క్ లా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే సీఎం కేసీఆర్ ఎలా అయిది చలనం లేకుండా తన పని తాను చేసుకు వెళ్ళాడో ఇప్పుడు రాజధాని తరలింపు విషయంలో కూడా జగన్ అదే తీరులో ప్రవర్తిస్తున్నారు. ఒకపక్క రైతులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నా, ప్రతిపక్ష పార్టీలు రైతుల పక్షాన పోరాటం చేస్తున్నా అవేమీ పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ రాజధాని తరలింపు ప్రక్రియ మొదలు పెట్టారు.
రైతుల పోరాటం సాగుతున్నా మార్పు వైపే జగన్ మొగ్గు
మరో రెండు మూడు నెలల్లోనే రాజధాని తరలింపు జరగబోతుందా ? విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మారబోతుందా ? అంటే తాజా పరిణామాలు అవును అనే చెప్తున్నాయి. ఏపీ రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నా రాజధాని మార్పు కోసం పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది . ఏపీ రాజధాని విశాఖకు తరలిపోతే ఊరుకునేది లేదని అత్మత్యాగాలకైనా వెనుదీయమని రాజధాని రైతులు చెప్తుంటే, ఎవరేం చేసినా విశాఖ నే రాజధాని అని తేల్చి చెప్తున్నాయి తాజా పరిణామాలు. ఇక అందుకు జగన్ మకాం వైజాగ్ కు మారుస్తున్నరన్న వార్తలు ఊతం ఇస్తున్నాయి.
మూడు రాజధానులకే కట్టుబడిన జగన్ ... సీఎం కేసీఆర్ తరహాలో స్ట్రాంగ్ నిర్ణయం
రాజధానిగా విశాఖ ఏర్పాటు డిసైడ్ అయిపొయింది. ఎవరెంత గగ్గోలు పెట్టినా రాజధాని మార్పు పక్కా అని తేల్చేసింది ఏపీ సర్కార్ . మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాలు పాలక ప్రభుత్వాలను ఏమి చెయ్యలేవని తాజాగా తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ఆర్టీసీ సమ్మె స్పష్టం చేసింది. 52 రోజుల పాటు జరిగిన సమ్మెలో చివరకు కార్మికులే వెనకడుగు వేసి సీఎం కేసీఆర్ కు సలాం కొట్టాల్సి వచ్చింది. ఆయన చెప్పినట్టు అన్నిటికి తలొగ్గి పని చెయ్యాల్సి వచ్చింది. ఇక ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. పదుల సంఖ్యలో కార్మికులు మరణించినా చలించకుండా తాను అనుకున్నదే చేశారు సీఎం కేసీఆర్ .
సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల విషయంలో చేసిందే రాజధానుల విషయంలో జగన్ చేస్తారా ?
ఇప్పడు జగన్ తీరు కూడా సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రవర్తించిన విధానానికే అద్దం పడుతుంది. రాజధాని రైతులు రోజుకో రకంగా పోరాటం చేస్తున్నా పట్టించుకోని సర్కార్ రాజధాని తరలింపుపనులు ముమ్మరం చేసింది. రాజధాని ఏర్పాటు కోసం విశాఖలో భూసేకరణపై దృష్టి పెట్టి శరవేగంగా భూసేకరణ చేస్తుంది. అంతే కాదు అమరావతి నుంచి విశాఖపట్నం నగరానికి సచివాలయాన్ని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం తేదీ ఖరారు చేసింది.
సచివాలయ ఉద్యోగుల తరలింపుకు మౌఖిక ఆదేశాలు .. జగన్ మకాం కూడా మార్చే యోచన
ఏప్రిల్ 6వ తేదీన ముహూర్తంగా నిర్ణయించింది. ఏప్రిల్ 6వ తేదీ సోమవారం నుంచి విశాఖలో సచివాలయం నుంచి పనులు జరగాలని ఇప్పటికే సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెలలో అధికారిక ఉత్తర్యులు జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంత కంటే ముందుగానే ఉద్యోగులను వైజాగ్ కు తరలించే సన్నద్ధం చేస్తోంది. అంతే కాదు సీఎం జగన్ నివాసానికి అనువైన ప్రాంతం కోసం కూడా అన్వేషణ సాగుతుంది.
అమరావతి రైతుల వేదన అరణ్య రోదనేనా ?
ఆందోళనలు చేసి చేసి విసిగి వేశారి వాళ్ళే తమకు ఏదో ఒక విధంగా లాభం చేకూర్చమని చర్చలకు వస్తారని ఏపీ సర్కార్ భావిస్తోంది. అందుకే రాజధాని రైతుల పోరాటాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవటం లేదు. మరో పక్క రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశం కావటంతో కేంద్రం పెద్దగా ఈ వ్యవహారం లో జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఇక ఈ పరిస్థితుల్లో అమరావతి రైతుల వేదన అరణ్య రోదనగా మారుతుందేమో అన్న అనుమానం కలుగుతుంది .