జగన్ క్యాబినెట్ లో ఉన్న కిక్కే వేరబ్బా..! మంత్రి పదవి కోసం 50మంది ఎమ్మేల్యేల పోటీ..!!
అమరావతి/హైదరాబాద్ : సుధీర్గ కాలం ప్రజల మద్య ఉన్నారు. ఎన్నో ఒడిదొడుకులను అనుభవిచారు. మరెన్నో అవమానాలను భరించారు. తొమ్మిదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నారు.. ఎన్నో ఆటు పోట్లను తట్టుకున్నారు. కోట్లు ఖర్చుపెట్టారు. మరి అవన్నీ రాబట్టుకునేదెలా! నష్టం భర్తీ చేసుకునేందుకు మార్గమెలా! అధికారం చేపట్టిన వైసీపీ నేతల్లో ఆలోచనలివి. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఏవో కాంట్రాక్టులు, కమీషన్లు అందుకోవటం సర్వసాధారణం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చేసేది.. చేయబోయేది కూడా ఇదే. దీనికి వైసీపీ నేతల్లో ఎలాంటి మినహాయింపు కనిపించడం లేదు. అందుకోసం మంత్రివర్గంలో చోటుకోసం ఎమ్మెల్యేలు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
! సుధీర్గ కాలం అదికారానికి దూరం..! మంత్రి పదవి కావాలంటున్న ఎమ్మెల్యేలు..!!
జగన్ తాను అవినీతి రహిత పాలన అందిస్తానంటూ నవ్వుకున్న వారి వరుసలో వైసీపీ నేతలు అధికంగా ఉంటారంటూ టీడీపీ నేతలు ఎద్దేవాచేశారు. అసలు అవినీతి అనేది ప్రజల్ని ప్రభావం చేసే అంశమే కాదనేది.. ఇప్పటికే టీడీపీ, వైసీపీ గెలుపుతో అర్థమోతోందంటూ జనసేన చెబుతోంది. ఇవన్నీ పక్కనబెడితే.. వైసీపీ నుంచి నెగ్గిన 150 మందికి పైగా ఎమ్మెల్యేల్లో 50 మంది వరకూ మంత్రిపదవిపై ఆశలు పెంచుకున్నారు.
జగన్ పై పెరుగుతున్న ఒత్తిడి..! సమ న్యాయం చేస్తారా..!!
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్తో తమకు ఉన్న సన్నిహితం బయటపెడుతూ.. జగన్ కేబినెట్లో తొలి మంత్రిపదవి తమకేనంటూ ఎవరికివారు లెక్కలు వేసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలోని బొత్స సత్యనారాయణ నుంచి కృష్ణాలో పార్దసారధి, విజయవాడలో మల్లాది విష్ణు ఇలా.. చాంతాడంత జాబితానే కనిపిస్తుంది. కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాలతో ఆ అదృష్టం తమనే వరిస్తుందని చాలామంది లెక్కలు కట్టే పనిలో ఉన్నారు.
మొదలైన లాబీయింగ్..! పోటీ పడుతున్న ఎమ్మెల్యేలు..!!
జూన్ రెండోవారంలో మంత్రివర్గాన్ని ఖరారు చేస్తానంటూ జగన్ స్వయంగా ప్రకటించటంతో.. ఆశవహులు.. వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి నేతల వద్ద పంచాయతీ పెడుతున్నారట. వారిని ప్రసన్నం చేసుకుని మంత్రివర్గంలో తమ చోటు కోసం పైరవీలు మొదలు పెట్టారట. అయితే జగన్ మోహన్రెడ్డి మాత్రం.. తమ మంత్రిమండలిపై రెడ్డి కుల ముద్ర పడకుండా అందరికీ సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట.
పార్టీలో ఎవరేంటో తనకు తెలుసంటున్న జగన్..! అందరిని చూసుకుంటానంటున్న అధినేత..!!
సాగునీరు, హోంశాఖలకు సమర్థులు, అనుభవంతో పాటు కాస్తయినా నిజాయతీ ఉందని భావించిన వారికే కీలకమైన పదవులు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నారంటూ వైసీపీ శ్రేణులు అంచనా వేసుకుంటున్నాయి. మంత్రి పదవులు కేటాయించినా జగన్కు కుడి భుజంగా మెలిగే నేతలే ఆ శాఖలనూ శాసిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన.. టీడీపీ మంత్రులుగా.. వైసీపీలోనూ మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతారా! స్వయం ప్రతిపత్తితో పనిచేస్తారా ? చూడాల్సిందే...!!