బాలయ్య ఇలాకాలోకి జగన్ ..టిడిపి కంచుకోటలో జెండా ఎగిరేనా : బైపోల్ తరువాత నంద్యాల కు తొలిసారి
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. టిడిపి కి కంచుకోట అయిన అనంతపురం జిల్లా హిందూపూర్ లో ఈ రోజు వైసిపి అధినేత జగన్ పర్యటించనున్నారు. అక్కడ బాలకృష్ణ గురించి జగన్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ఇక, నంద్యాల లోనూ జగన్ పాల్గొంటున్నారు. ఉప ఎన్నికలో పరాజయం తరువాత జగన్ తొలి సారి నంద్యాలకు వస్తుండటంతో ఆసక్తి నెలకొని ఉంది.
బాలయ్య ఇలాకాలోకి జగన్..
ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ఈ రోజు హిందూపూర్ లో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నారు. హిందూ పూర్ లో 2014 నాటికి ఇప్పటికీ వైసిపి పుంజుకుందని..ఈ సారి హోరా హోరీ పోరు తప్పదని వైసిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హిందూపూర్ నుండి బాలకృష్ణ రెండో సారి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్ధి గా గత ఎన్నికల్లో వైసిపి నుండి నవీన్ నిశ్చల్ ఉండగా..ఈ సారి మైనార్టీ అభ్యర్దిని జగన్ బరిలోకి దింపారు. రిటైర్డ్ పోలీసు అధికారి ఇక్బాల్ ఈ ఎన్నికల్లో బాలయ్య పై పోటీకి దిగారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని సైతం వైసిపి లో చేరారు. టిడిపి ఆవిర్భావం నుండి టిడిపి ఇక్కడ గెలుస్తూనే ఉంది. అయితే, ఈ సారి మాత్రం వైసిపి సత్తా చాటుతుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో..బాలయ్య సైతం అక్కడ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గతంలో తన పిఏ మీద..మంచినీటి సరఫరా, స్థానిక సమస్యల పై స్థానికులు నిరసన వ్యక్తం చేసారు. వీటన్నింటినీ సమర్ధించుకుంటూ బాల కృష్ణ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
నియోజకవర్గం దాటని బాలకృష్ణ...
ఎన్నికల వేళ టిడిపికి మద్దతుగా బాలకృష్ణ ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే, ఈ సారి మాత్రం ఇప్పటి వరకూ తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. హిందూపూర్ దాటి ఇతర నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లలేదు. తన ఇద్దరు అళ్లుళ్లు సైతం ఎన్నికల బరిలో ఉన్నారు. పెద్ద అల్లుడు లోకేష్ మంగళగిరి నుండి, చిన్నల్లుడు భరత్ విశాఖ నుండి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు బాలకృష్ణ వారికి మద్దతుగా ప్రచారానికి వెళ్ల లేదు. ఇక, హిందూ పూర్ లో బాలయ్య సతీమణి వసుంధర ప్రచారం లో ఉన్నారు. బాలకృష్ణ కు ఓట్లు వేయమని అభ్యర్దిస్తున్నా రు. ఇప్పటి దాకా హిందూపూర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా నందమూరి హీరోలు ఎవరూ ప్రచారానికి వస్తు న్నట్లుగా సమాచారం లేదు. ఇక, ఇప్పుడు జగన్ పర్యటన కు వచ్చే స్పందనకు అనుగుణంగా చివరి నాలుగు రోజుల్లో హిందూపూర్ కు బాలయ్య కు మద్దతుగా ప్రముఖులు ప్రచారానికి వచ్చే అవకాశం ఉంటుంది.
నంద్యాల పర్యటన పై ఆసక్తి..
నంద్యాల లో హోరా హోరీగా జరిగిన ఉప ఎన్నికల్లో వైసిపి పరాజయం పాలైంది. దాదాపు 13 రోజుల పాటు నంద్యాల లోనే ఉంటూ ఎన్నికల ప్రచారం చేసిన జగన్..ఫలితం వచ్చిన తరువాత చంద్రబాబు తమను దెబ్బ తీసారు..దెబ్బ తిన్నాం..ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుందని అని ఆవేశంగా చెప్పారు. ఇక, ఆ తరువాత తొలి సారిగా జగన్ నంద్యాల లో పర్యటించబోతున్నారు. అక్కడ రోడ్ షో తో పాటుగా ప్రచార సభలోనూ పాల్గొంటారు. ఉప ఎన్నిక సమయంలో టిడిపి ఇచ్చిన హామీల ప్రస్తావన గురించి జగన్ గుర్తు చేసే అవకాశం ఉంది. నంద్యాల నుండి శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవి చంద్రారెడ్డి వైసిపి అభ్యర్దిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే గంగుల సోదరులు సైతం వైసిపికి మద్దతు ప్రకటింటచంతో ఇప్పుడు అక్కడ భూమా కుటుంబం తో రాజకీయ పోరాటం సాగుతోంది. జగన్ కు నంద్యాల లో ఎలాంటి స్పందన వస్తుందనే దాని పై ఆసక్తి నెలకొని ఉంది.