జగన్ రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా తీర్చి దిద్దుతున్నారన్న వైసీపీ మహిళా నేత
మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో దుమారంగా మారాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్ గా ప్రెస్ మీట్ నిర్వహించిన కిల్లి కృపారాణి నోరు జారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆమెపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. కేంద్ర మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ మహిళా నేత కిల్లి కృపారాణి చంద్రబాబు నాయుడిని ఏదో అనాలి అనుకొని వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఏదో అనేసారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
రాజ్య సభ సభ్యురాలిగా కిల్లి కృపారాణికి ఛాన్స్ !!... స్థానిక వైసీపీ నేతల విముఖత .. రీజన్ ఇదే
ఈ నెల 21 వ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రానున్నారు. జిల్లాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం రానున్న నేపథ్యంలో చంద్రబాబు టార్గెట్ గా ప్రెస్ మీట్ పెట్టారు కిల్లి కృపారాణి. ఇక ఆమె సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేసున్న పథకాలపై విమర్శలు కురిపిస్తున్న చంద్రబాబు నాయుడుకి గట్టి కౌంటర్ ఇవ్వాలి అనుకున్నారు. ప్రెస్ మీట్ లో కిల్లి కృపారాణి జగన్ పాలన గురించి చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ఇక దీంతో ఆమె మాట్లాడిన ఈ విషయం కాస్త వైరల్ కావడం, తెలుగు తమ్ముళ్లు ,జనసేన పార్టీ కార్యకర్తలు ఆమె వీడియోలు వైరల్ చేస్తూ ట్రోల్ చేయడం ఏపీ లో హాట్ టాపిక్ అయింది.
సుదీర్ఘ అనుభవం ఉన్న కిల్లి కృపారాణి వంటి నేతలు సైతం అప్పుడప్పుడు ఇలా మాట తడబడటంతో ఇక అవకాశం దొరికిందని సోషల్ మీడియా వేదికగా ఆ వ్యాఖ్యలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అలవాటుగా మారిపోయింది. అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి అనాల్సిన చోట, అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అనడంతో అసలు అర్థమే మారిపోయింది. చంద్రబాబు నాయుడుపైన విమర్శల మాట అటుంచి ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆమె చేసిన వ్యాఖ్యలే హైలెట్ గా మారాయి. అవకాశం కోసం ఎదురుచూసే ప్రతిపక్ష పార్టీలకు పండగలా అనిపిస్తున్నాయి.