అదికారులకు జగన్ ఛీర్స్..! సీఎం నిర్ణయంతో రెట్టింపైన హుషారు..!!
అమరావతి/హైదరాబాద్ : ఏదైనా పనిని బానిసగా చేయడం వేరు.. పనిని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా చేయడం వేరు. ఏపి ప్రభుత్వం అదికారులు ప్రస్తుతం రెండో అంశంతో ఉత్సాహంగా పనులు చేసుకుంటున్న తెలుస్తోంది. అందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయమే కారణమంటున్నారు ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులుగా మీ పని మీరు చేయండి. గత ప్రభుత్వంతో ఎలా ఉన్నారనేది నాకు సంబంధం లేదు. ఉద్యోగసంఘాల నేతలు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నేతలతో చనువుగా ఉండటం కూడా పెద్ద తప్పేం కాదు. అలాగనీ.. విది నిర్వహణలో ఖచ్చితంగా ఉండకుంటే ఎవరైనా ఒక్కటేనంటూ సీఎం జగన్ ఇచ్చిన హింట్ ఉద్యోగ వర్గాల్లో మాంచి ఖుషీనే నింపింది. కేవలం రెడ్డి సామాజికవర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని భావించినా అర్హత, సమర్థత ఆధారంగా పోస్టింగ్లు కేటాయిస్తూ వచ్చారు సీఎం.
అంతా స్నేహ పూర్వకం..! టెన్షన్ లేకుండా పనిచేసుకోండన్న సీఎం..!!
ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఇద్దరినీ తెలంగాణ నుంచి డిప్యూటేషన్ మీద పిలిపించి మరీ మంచి పోస్టింగ్లు కేటాయించారు. ఇది కేవలం ఉదాహరణలు మాత్రమే. సమీక్షలు, సమావేశాల్లో సీనియర్ అధికారులను గౌరవించటం.. వారికి సముచితస్థానం.. వారి మాటలకు విలువకట్టడం వంటి వాటి విషయంలో జగన్ తన తండ్రి వైఎస్ రాజేశేఖర్రెడ్డిని మించాడనే భావన ఉద్యోగవర్గాల్లో నెలకొంది. ఇది నిజంగానే ప్రభుత్వానికి సానుకూల సందేశం. సమీక్షల సమయాన్ని కూడా జగన్ చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారట.
సీఎం నిర్ణయంతో ఉద్యోగుల్లో ఉత్సాహం..! సీఎం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు..!!
గత టీడీపీ హయాంలో చంద్రబాబు ఉదయం 8 నుంచి అర్ధరాత్రి 12 దాటేంత వరకూ సమావేశాలు చేసేవారు. పైగా వచ్చిన అధికారగణానికి భోజన వసతి సంగతి పెద్దగా పట్టించుకునేవారు కాదట. పోనీ.. ఏదైనా మాంచి హోటల్లో తిందామంటే కొత్త రాజధాని చుట్టుపక్కల సరైన హోటల్ కూడా లేని పరిస్థితి. కాదంటే.. విజయవాడ, గుంటూరు పంపించి భోజనం తెప్పించుకోవాల్సి వచ్చేదట. కానీ.. ఇప్పుడు జగన్ స్వయంగా తాను తినే భోజనాలను అధికారులకూ ఏర్పాటు చేస్తున్నారట.
ఉద్యోగులను ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్..! ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచన..!!
సమీక్షలు గాకుండా బయట కనిపిస్తే.. అన్నా అంటూ అప్యాయంగా పలుకరించటాన్ని నిజంగానే ఉద్యోగులు గొప్పగా భావిస్తున్నారు. పోస్టింగ్లు, ప్రమోషన్ల సంగతి మీరు ఆలోచించవద్దు.. మీ పని మీరు చేయండి.. ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురమ్మని మాత్రమే కోరుతున్నారట. ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో ఏవో లెక్కలు చూపబోతే.. చూడండీ.. తప్పుడు లెక్కలతో నాకు సంబందం లేదు.. రైతులకు అవసరమైన సమయంలో రుణాలు ఇవ్వండి.. అంతకు మించి మీరేం చెప్పవద్దంటూ సూచించారట. మరో అధికారి డ్యాష్ బోర్డు గురించి మాట్టాడబోతే.. జనం సంగతి చూడండీ.. ఈ హైటెక్కులు మనకెందుకంటూ చురక వేశారట.
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి..! శాంతి భద్రతల అంశంలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సలహా..!!
పోలీసింగ్ విషయంలో కూడా ఖచ్చితంగా ఉండాలని.. ఎటువంటి శాంతిభద్రతల సమస్య తలెత్తినా.. పోలీసు అధికారులతోపాటు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలదీ భాగం అవుతుందని మరీ హెచ్చరించారట. ఎవరైనా మంత్రులు పైరవీలకు పంపితే తనకు చెబితే చాలంటూ భరోసానిచ్చారట. కేవలం మూడు నాలుగు గంటల సమీక్షలు, ఏ విషయమైనా సూటిగా.. క్లుప్తంగా చెప్పటం.. చేయగలిగితే.. ఓకే కాదంటే కారణాలు అన్వేషించి ప్రత్యామ్నాయాలను గుర్తించటం ఇదే అధికారుల ముందున్న ఏకైక మార్గంగా మారిందట.. ఈ లెక్కన ఇప్పటి వరకూ ఏపీ కేడర్కు ఎందుకు వచ్చామా! అంటూ తలలు పట్టుకున్న అధికారులు, ఉద్యోగులు కూడా ప్రస్తుతం కొత్త సీఎం జగన్ చూపుతున్న చొరవ.. అందిస్తున్న తోడ్పాటుతో తెగ ఖుషీ అవుతున్నారట.