జగన్ ఆ హామీని అమలు చేయలేడు..! విజయమ్మ సంచలన వ్యాఖ్యలు..!!
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : వంద రోజుల వైసీపి పాలనపై, తాజాగా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. సాధారణంగా ఒక కొడుకు గురించి తల్లి ఏం చెప్పగలదో అదే చెప్పే ప్రయత్నం చేసారు విజయమ్మ. ఏం దాచగలదో అదే దాచిపెట్టే ప్రయత్నం కూడా చేసారు. అయితే... రెండు విషయాలపై మాత్రం ఆమె చాలా ఆసక్తికరంగా స్పందించారు. ఇది కొడుకు బాగుకోసం తల్లి చేసిన హెచ్చరికా? లేక డైరెక్టుగా చెబితే వినడని, తల్లి ఇచ్చిన బహిరంగ హెచ్చరికా అన్నది ఆసక్తికరంగా మారింది.
జగన్ పాలనపై ఆమె స్పందిస్తూ, ఇది సినిమా కాదు, వంద రోజులు ఆడిందని సంతోషపడేందుకు. ఇది ఒక నిర్విరామమైన, నిరంతర కార్యక్రమమని, ప్రతిరోజు నడుస్తూ నడిపిస్తూ ఉండాలని విజయమ్మ తెలిపారు. తండ్రి కంటే మంచి పాలన అందించాలనే తాపత్రయం జగన్ లో ఉందన్నారు. అది కష్టపడి జగన్ సాధించాలని, సాధిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. తన భర్తకు కొన్ని విషయాల్లో సలహాలు ఇచ్చేదాన్ని అని, అలాగే తన కొడుకుకు కూడా సలహాలు అవసరమైనపుడు ఇస్తాను అని విజయమ్మ అన్నారు.
అంతే కాకుండా ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలపై విజయమ్మ స్పందించారు. జగన్ తన అన్ని హామీలు నెరవేర్చడానికి ప్రయత్నిస్తారని, ఆ దిశగా ముందుకు వెళ్తారని చెబుతూనే.., ఒక్క హామీ విషయంలో విఫలమవుతాడేమోననే సందేహాన్ని విజయమ్మ వ్యక్తంచేశారు. సంపూర్ణ మద్య నిషేధం చాలా కష్టసాధ్యమైన హామీ అని విజయమ్మ అభిప్రాయ పడ్డారు. అది నిలబెట్టుకోవడం అన్నిరకాలుగా కష్టమే అన్నారు. విజయమ్మ మాటలను చూస్తే, లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుతుంది ఎక్సైజ్ శాఖ మాత్రమేనని, ఇప్పుడు ఆ శాఖలు రద్దు చేస్తే ఆదాయం పడిపోతుందనే భావనను విజయమ్మ వ్యక్తం చేసారు.
జగన్ ప్రమేయం లేకుండా మీడియాలో ఈ వ్యాఖ్యలు ప్రసారం అయ్యే అవకాశాలే లేవు. ఈ మాటలు ప్రసారం చేశారంటే, సంపూర్ణ మద్యపాన నిషేధానికి ఏదో అవరోధం పొంచి ఉందనే సంకేతాలు వెలువడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సంపూర్ణ మద్య పాన నిషేధంపై భవిష్యత్తులో ఆశలు వదులుకోవడానికి విజయమ్మ ద్వారా ఓ చిన్న సందేశం ఇప్పించారనే సందేహాలు ఏపి నేతల్లో లేకపోలేదు. మద్యపాన ఆదాయాన్ని కూడా ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారంటే, అదే కారణం కావచ్చనే చర్చ జరుగుతోంది.