సీఎం జగన్ మరో కీలక నిర్ణయం : టీటీడీ బోర్డు సభ్యుడిగా దిల్ రాజు..!! బీజేపీ హైకమాండ్ నుండి సిఫార్సులు
ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటు పైన ముఖ్యమంత్రి జగన్ కసరత్తు దాదాపు పూర్తి చేసారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత వెంటనే బోర్డు ఏర్పాటు జరుగుతుందని అందరూ భావించారు. అయితే, అప్పుడు బోర్డు ఛైర్మన్ గా సుబ్బారెడ్డిని నియమిస్తూ ముఖ్మమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇక, టీటీడీలో జరుగుతున్న పరిణామాల క్రమంలో బోర్డు ఏర్పాటు తో పాటుగా.. అదే సమయంలో నామినేటెడ్ పోస్టుల కోసం నిరీక్షిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
దీంతో టీటీడీ బోర్డు నియామకం మీద ముఖ్యమంత్రి తుది కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో మొత్తం 19 మంది సభ్యులకు అవకాశం ఉంది. తెలంగాణ..తమిళనాడు..కర్నాటక.. మహారాష్ట్ర నుండి సభ్యులు నామినేట్ కానున్నారు. ఇదే సమయంలో బోర్డు సభ్యుల నియమాకంలో జగన్ ఈ సారి కొత్త వ్యక్తులకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా కొందరి పేర్లు జగన్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
తెలంగాణ నుండి ముగ్గురు సభ్యులు...!!
టీటీడీ బోర్డులో అవకాశం కల్పించాలంటూ ముఖ్యమంత్రి జగన్ మీద ఒత్తిడి పెరుగుతోంది. అనేక మంది ప్రముఖులు టీటీడీలో అవకాశం కోసం పోటీ పడుతున్నారు. వీరి కోసం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం సిఫార్సు చేస్తున్నారు. కొందరు ఆధ్మాత్మిక స్వామీజీలు సైతం తమ శిష్యుల పేర్లను ముఖ్యమంత్రికి ప్రతిపాదిస్తున్నారు. ఇక, తెలంగాణ నుండి ముగ్గురు పేర్లు జగన్ పరిశీలనలో ఉన్నాయి. వారికి టీటీడీ బోర్డు సభ్యులుగా నియామకం ఖరారైందని చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో పూర్తిగా తెలంగాణ నుండి పార్టీ నేతలకే బోర్డు సభ్యులుగా అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుండి బీజేపీ ఎమ్మెల్యేకు తొలి దఫా లో ఛాన్స్ కల్పించారు. ఇక, ఇప్పుడు మాత్రం జగన్ ప్రముఖ పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వరరావు పేరు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన చాలా కాలంగా ఆధ్యాత్మికంగానూ సేవలు అందిస్తు న్నారు. టీటీడీలో సభ్యుడిగా సేవలు అందిచాలని భావిస్తున్నారు. ఇక, ప్రముఖ సినీ దర్శకుడు దిల్ రాజు పేరు సైతం ఖరారైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు హాయంలో దర్శకుడు రాఘవేంద్ర రావుకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం రాగా..ఇప్పుడు దిల్ రాజుకు ఛాన్స్ దక్కనుంది. ఇక, జగన్ కు మార్గదర్శకం చేసే స్వామిజీ ఒక టీవీ ఛానల్లో కీలక పాత్ర పోషిస్తున్న సుబ్బారావు పేరు ముఖ్యమంత్రికి సిఫార్పు చేసినట్లుగా సమాచారం. దీని పైన ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
బోర్డులో అవకాశం కోసం ప్రదిక్షణలు..
తమకు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించాలంటూ వైసీపీ విజయం కోసం పని చేసిన పలువురు నేరుగా ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందిస్తున్నారు. పార్టీలో సీనియర్ల ద్వారా ముఖ్యమంత్రికి సిఫార్సు చేయించుకుంటున్నారు. ఇదే సమయంలో జగన్ మాత్రం తిరుమలలో తమ ప్రమేయం లేకపోయినా వివాదాల్లో తమ పేరు ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారనే కారణంతో జాగ్రత్తగా బోర్డు ఏర్పాటు పైన కసరత్తు చేస్తున్నారు. ఎక్కడా విమర్శలకు ఛాన్స్ ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇప్పటికే బోర్డు సభ్యులుగా కడప జిల్లాకు చెందిన ఆకేపాటి అమర్నాధ రెడ్డి.. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వర రావు పేరు పరిశీలనలో ఉన్నట్లుగా తెలిసింది. అదే విధంగా మాజీ సీఎస్ ఒకరి పేరు సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా.. కర్నాటక నుండి ఒక స్వచ్చంద సంస్థల నిర్వహాకుడి పేరు ఖరారు చేసారు. మహారాష్ట్ర నుండి టీటీడీలో సీటు కోసం బీజేపీ జాతీయ స్థాయి ముఖ్య నేత ఒకరి పేరు సిఫార్సు చేసినట్లు తెలిసింది. మాజీ ఐపిఎస్ అధికారి ఒకరి పేరు జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆయన పోలీసు బాస్ గా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తిగా ఆధ్యాత్మిక రంగంలోనే కొనసాగుతున్నారు. అదే విధంగా ఇద్దరు మహిళా పేర్లను జగన్ పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో అధికారికంగా జాబితా ఖరారు కానుంది.
పెద్ద ఎత్తున సిఫార్సులు.. కొనసాగుతున్న కసరత్తు
ఇక, బోర్డులో టీటీడీ ఛైర్మన్ తో పాటుగా ఈవో.. దేవాదాయ కమిషనర్.. తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యలుగా కొనసాగుతారు. వీరితో పాటుగా మూడు రాష్ట్ర ప్రతినిదులు.. ఏపీ నుండి మిగిలిన సబ్యులతో బోర్డు ఏర్పాటు కానుంది. ప్రభుత్వం తీసుకున్న 50 శాతం రిజర్వేషన్ల విధానం ఈ బోర్డు ఏర్పాటుకు వర్తించదని ఇప్పటికే స్పష్టం చేసారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ పైన టీడీపీతో పాటుగా బీజేపీ సైతం మతపరమైన అంశాల్లో ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు. దీంతో...ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నామినేటెడ్ పోస్టులు ఖరారు చేయాల్సి ఉంది. దీంతో..ముందుగా టీటీడీ బోర్డు ఏర్పాటు చేయటం ద్వారా ఒత్తిడి తగ్గి..ఇతర పోస్టుల నియామకం పైన ఫోకస్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.