ఇంతమంది ఉసురుపోసుకుని ఫ్యాక్టరీనా? ప్రజల గోడు పట్టించుకోరా? : జగన్
తణుకు : 'ఇంతమంది ఉసురుపోసుకుని ఫ్యాక్టరీ పెట్టడం అవసరమా.. ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం జరుగుతుందని ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకోరా' అంటూ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవద్దంటూ నిరసన వ్యక్తం చేస్తోన్న పశ్చిమగోదావరి జిల్లా రైతులకు బాసటగా నిలిచారు.
ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తోన్న వారిపై ప్రభుత్వం బైండోవర్ కేసులు పెడుతోన్న నేపథ్యంలో.. సత్యవతి అనే మహిళను జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం నాడు తణుకు సబ్ జైల్లో ఆమెను పరామర్శించారు జగన్. ఈ సందర్బంగా.. సత్యవతి ఏం తప్పు చేసిందని ఆమెను జైల్లో పెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జగన్. గ్రామాలను కాలుష్యం ముంచెత్తకుండా అరికట్టాలని కోరడమే సత్యవతి చేసిన నేరమా.. అంతమాత్రానికే వారిపై హత్యాయత్నం కేసులు పెడుతారా అంటూ నిలదీశారు.
ప్రభుత్వ తప్పులను ఏకరువు పెడుతూ.. గ్రామస్తులు వద్దని మొరపెట్టుకుంటున్న గ్రామం నడిమధ్యలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం మొదటి తప్పని, వద్దని అన్నందుకు అమాయకులపై హత్యాయత్నం కేసులు మోపడం మరో తప్పని, గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టడం మూడో తప్పని మండిపడ్డారు జగన్. గ్రామాల్లో భయాందోళనలు రేకెత్తించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని వ్యతిరేకించినందుకు ఏడుగురిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే రిపీటవుతోంది..
ఇప్పటికే డెల్టా పేపర్ మిల్లుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు ఆక్వాఫుడ్ అంటూ మరో ఫ్యాక్టరీ పెడితే మళ్లీ అదే పరిస్థితి పునరావ్రుతం అవుతందన్నారు జగన్. ప్రభుత్వానికి కావాల్సిన వారికోసం టీడీపీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని, పది కి.మీ దూరంలో ఉన్న సముద్ర తీరంలో ఫ్యాక్టరీ పెట్టుకోండని జనం ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఓవైపు కాలుష్యం ఉండదని చెబుతూనే.. మరోవైపు ఫ్యాక్టరీ కోసం పైప్ లైన్ నిర్మిస్తామని చెబుతున్నామని, ఒకవేళ పైప్ లైన్ లీకేజీ అయి తీవ్ర నష్టం వాటిల్లితే పరిస్థితేంటని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ప్రకటించిన జగన్.. ఫ్యాక్టరీని జనావాసాల మధ్య కాకుండా సముద్ర తీరానికి తరలిస్తే అందరికీ మేలు జరుగుగతుందన్నారు.
సముద్ర తీరప్రాంతంలో మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీకి 350 ఎకరాల స్థలం ఇప్పటికే ఉన్నట్లు సమాచారం ఉందని, యాజమాన్యం స్పందించి సముద్ర తీరప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పుకుంటే తాము సహకరిస్తామని చెప్పారు జగన్.
సత్యవతితో పాటు మరో ఆరుగురు జైల్లోనే
ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసినవారిలో.. మొత్తం ఏడుగురిని ప్రభుత్వం ఇప్పటికే అరెస్టు చేయించగా.. అందులో సత్యవతి తణుకు సబ్ జైల్లో ఉన్నారు. మిగతా ఆరుగురు నర్సాపురం జైల్లో ఉన్నారు. సత్యవతిపై సెక్షన్307 కింద హత్యాయత్నం కేసు మోపడంతో 36రోజులుగా జైలు జీవితం గడుపుతున్నారు సత్యవతి.